Employees | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: టైమ్కొస్తే చాలదు.. పని చేయాలని కంపెనీలు అంటున్నాయి. ఉత్పాదకత మదింపు కోసం సమయపాలన కంటే నాణ్యమైన పనే ముఖ్యమని దేశంలోని మెజారిటీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. సంప్రదాయ కాలం ఆధారిత కొలమానాల కన్నా ఉద్యోగుల నుంచి మెరుగైన పనిని రాబట్టుకోవడానికి రివార్డులు, గుర్తింపులు చాలా అవసరమని స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగాలు, నిపుణుల నెట్వర్కింగ్ వేదిక అప్నా.కో నిర్వహించిన ఓ తాజా అధ్యయనంలో 10 సంస్థల్లో 7 ఇదే మాట చెప్తున్నాయిమరి. నాణ్యమైన పని, టార్గెట్లు, ప్రాజెక్టు పూర్తయిన విధానం వంటివి ఉద్యోగుల సామర్థ్యానికి గీటురాళ్లు అని 77 శాతం సంస్థల యాజమాన్యాలు పేర్కొన్నాయి.
మొత్తానికి కార్యాలయాలకు లేదా పని స్థలాలకు నిర్దేశించిన సమయానికి వచ్చి పని చేయకపోతే ఏం లాభం అన్న రీతిలో ఈ సర్వేలో ఫలితం వెలువడింది. ఇకపోతే పది సంస్థల్లో ఐదు కంపెనీలు.. పని గంటల్లో శిక్షణ, అభివృద్ధి, రెగ్యులర్ ఫీడ్బ్యాక్కు ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయి. ఈ సర్వేలో 5వేలకుపైగా సంస్థలు పాల్గొన్నాయి. ‘రోజూ సమయానికి పంచ్ కొట్టాలి, విరామం తీసుకోకుండా.. సెలవులు పెట్టకుండా పనిచేయాలని ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్న కంపెనీలతోపాటు ఇందుకు భిన్నంగా ప్రభావవంతమైన పని సంస్కృతిని పెంపొందించడానికి కంపెనీలు అనుసరిస్తున్న వ్యూహాలపైనా మా సర్వేలో దృష్టి పెట్టాం’ అని ఈ సందర్భంగా అప్నా.కో వ్యవస్థాపక సీఈవో నిర్మిత్ పరీఖ్ తెలిపారు.