EV Two Wheelers | వచ్చే నెల నుంచి ఎలక్ట్రిక్ టూవీలర్స్ ధరలు పెరగనున్న నేపథ్యంలో ఆయా ఈవీ మోటార్ బైక్స్, స్కూటర్ల తయారీ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇంతకుముందు మార్కెట్లోకి తెచ్చిన మోడల్ ఈవీ స్కూటర్లు, ఈవీ బైక్ల్లో ఫీచర్లు తగ్గించాలని, బ్యాటరీ సైజ్ కూడా కుదించాలని నిర్ణయానికి వచ్చాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ టూ వీలర్స్కు ఫేమ్-2 స్కీం కింద ఇచ్చే సబ్సిడీ తగ్గించేయడమే కారణం.
ఫేమ్-2 స్కీం కింద టూ వీలర్స్కు ఇచ్చే సబ్సిడీని తగ్గించనున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమలశాఖ ఈ నెల 19న నోటిఫికేషన్ జారీ చేసింది. కిలోవాట్ పై రూ.15 వేల నుంచి రూ.10 వేలకు సబ్సిడీ తగ్గుతుంది. గరిష్టంగా సబ్సిడీ 40 శాతం నుంచి 15 శాతానికి కుదించుకుపోయింది.
జూన్ ఒకటో తేదీ నుంచి సబ్సిడీ తగ్గిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ అమల్లోకి రానున్నది. దీనివల్ల ఈవీ స్కూటర్లు, బైక్ల ధరలు రూ.5000 పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు వినియోగదారుల నుంచి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ధరలు తగ్గించడానికి ఈవీ టూ వీలర్స్ తయారీ సంస్థలు కొన్ని అదనపు చర్యలు తీసుకోనున్నాయని తెలుస్తున్నది.
ప్రస్తుతం కేంద్రం ఖరారు చేసిన సబ్సిడీ.. ఈవీ టూ వీలర్స్ గ్రోత్ రేటుకు సరిపోదని మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ సీఈఓ సుమన్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పెట్రోల్ వాహనాల మధ్య గల ధరల తేడా తగ్గడానికి రెండు నుంచి రెండున్నరేండ్ల సమయం పడుతుందన్నారు.
ఈవీ టూ వీలర్స్ కంపెనీలు తమకు సబ్సిడీ పెంచడంతో 2021 జూన్లో బ్యాటరీ సైజ్ 2.5-3 కిలోవాట్లకు పెంచాయి. నాడు కిలోవాట్ మీద రూ.15 వేల సబ్సిడీ ఇవ్వడమే దీనికి కారణం. కానీ ఇప్పుడు సబ్సిడీ రూ.10 వేలకు తగ్గించడంతో ఆయా ఈవీ టూ వీలర్స్ కంపెనీలు తమ వెహికల్స్ బ్యాటరీ సైజు 1.5-2 కిలోవాట్లకు తగ్గిస్తాయని లిథియం అయాన్ బ్యాటరీ తయారీ సంస్థ సిగ్నీ ఎనర్జీ సీఈఓ వెంకట్ రాజా రమణ్ చెప్పారు. పెట్రోల్ వాహనాలతో పోటీ పడాలంటే ఈవీ టూ వీలర్స్ కు సబ్సిడీ కొనసాగించాల్సి ఉంటుందని తెలిపారు.