న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఆగస్టు 29తో ముగిసిన వారంలో భారత్ వాణిజ్య కార్యకలాపాలు కొవిడ్ ముందస్తుస్థాయిని అధిగమించాయని, కొత్త గరిష్ఠానికి చేరాయని జపాన్కు చెందిన బ్రోకింగ్ సంస్థ నోమురా తెలిపింది. సమీక్షా వారంలో నోమురా ఇండియా బిజినెస్ రిజంప్షన్ ఇండెక్స్ 102.7 పాయింట్లకు పెరిగింది. అంతక్రితంవారం ఇది 101.3 పాయింట్లు. 2020 మార్చిలో కొవిడ్ సంక్షోభం తలెత్తకముందునాటి వాణిజ్య కార్యకలాపాల్ని పోల్చిచూసే ఈ ఇండెక్స్ రెండు కొవిడ్ వేవ్ల సమయంలో బాగా క్షీణించింది. 2021 ఆగస్టులో ఈ ఇండెక్స్ 5.6 శాతం వృద్ధిసాధించగా, జూలైలో 17.1 శాతం, జూన్లో 17 శాతం చొప్పున పెరిగిందని నోమురా తెలిపింది. ఆగస్టు 29తో ముగిసినవారంలో విద్యుత్ డిమాండ్ 0.1 శాతం పెరిగిందని, గూగుల్ రిటైల్, రిక్రియేషన్ సూచి 0.6 శాతం మెరుగుపడిందని, యాపిల్ డ్రైవింగ్ ఇండెక్స్ 10 శాతం పెరిగిందని నోమురా వివరించింది.
కొత్త కేసులు పెరుగుతున్నాయ్…
కొవిడ్ కొత్త కేసులు గతవారంతో పోల్చితే సగటున 9,200 పెరిగాయని నోమురా పేర్కొంటూ పండుగల సీజన్ నేపథ్యంలో మూడోవేవ్ వచ్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని హెచ్చరించింది. 2022 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 10.4 శాతం మేర వృద్ధిచెందవచ్చని నోమురా అంచనాల్లో పేర్కొంది.