ముంబై, డిసెంబర్ 8: డిజిటల్ కరెన్సీ వస్తే ప్రధానంగా ఎదురయ్యే సవాళ్లు.. మోసాలు పెరగడం, సైబర్ సెక్యూరిటీకి ముప్పేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. డిజిటల్ కరెన్సీపై మొదట్నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్న దాస్.. బుధవారం కూడా మరోసారి అదే తీరును కనబరిచారు. ఓవైపు ఆర్బీఐ నేతృత్వంలోనే దేశీయ డిజిటల్ కరెన్సీకి దారులు పడుతుంటే.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకొస్తుంటే.. మరోవైపు సెంట్రల్ బ్యాంక్ చీఫ్ దాస్ ఇలా ఆందోళన చెందుతుండటం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. మూడు రోజుల ద్వైమాసిక ద్రవ్యవిధాన పరపతి సమీక్ష అనంతరం ఆ నిర్ణయాలను ఇక్కడ మీడియాకు దాస్ వివరించారు. డిజిటల్ కరెన్సీతో వచ్చే కొత్త ద్రవ్య వ్యవస్థలో అనేక చిక్కులు తలెత్తవచ్చని అభిప్రాయపడ్డారు.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అనేది ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీకి ఎలక్ట్రానిక్ రూపం అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవిశంకర్ ఈ సందర్భంగా తెలిపారు. సీబీడీసీల్లో రెండు రకాలున్నాయని, ఒకటి హోల్సేల్, రెండోది రిటైల్ అని వివరించారు. హోల్సేల్ ఆధారిత సీబీడీసీ కోసం లోతైన అధ్యయనాలే చేశామన్న ఆయన.. రిటైల్ సీబీడీసీ మాత్రం సంక్లిష్టంగా కనిపిస్తున్నదని, చలామణిలోకి ఇది వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని చెప్పారు. అయితే డిజిటల్ మోసాలు, సైబర్ రిస్కులు ప్రధాన సవాళ్లు విసురుతున్నాయన్నారు. అయినప్పటికీ వచ్చే ఏడాది ఆరంభంలో డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టు అమలు కావచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిజానికి ఈ నెల్లోనే సీబీడీసీ అందుబాటులోకి వస్తుందని గతంలో దాస్ సంకేతాలిచ్చిన సంగతి విదితమే.
డిజిటల్ లావాదేవీలపై పడుతున్న చార్జీల్లో సహేతుకతను తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ దాస్ చెప్పారు. ఈ క్రమంలోనే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, వాలెట్లు, యూపీఐ తదితర డిజిటల్ చెల్లింపుల కోసం కస్టమర్లపై విధిస్తున్న చార్జీల గురించి త్వరలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. యూపీఐ లావాదేవీలను పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా ప్రభావం నుంచి బాగా కోలుకుంటున్నదన్న దాస్.. పెట్రోల్, డీజిల్పై పన్ను కోతలు ద్రవ్యోల్బణం తగ్గేందుకు దోహదపడగలవన్నారు. వృద్ధిరేటును ప్రోత్సహించేందుకే ద్రవ్యవిధానంలో ఆచితూచి వ్యవహరిస్తున్నామన్నారు. కాగా, తాజా సమీక్షలో రెపోరేటును యథాతథంగానే ఉంచాలన్న దానికి ఆరుగురు సభ్యులున్న ఆర్బీఐ ద్రవ్యవిధాన కమిటీ.. 5:1 నిష్పత్తిలో ఆమోదం తెలిపింది. దీంతో గృహ రుణాలపై వడ్డీ భారం పెరగబోదంటూ రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
‘డిజిటల్ కరెన్సీతో సైబర్ సెక్యూరిటీ, మోసాల కోణంలో ఆందోళనగా ఉన్నది. మా దిగులంతా ప్రధానంగా వీటి గురించే. కొన్నేండ్ల క్రితం నకిలీ కరెన్సీ బెడద తీవ్రంగా ఉండేది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వస్తే మళ్లీ అటువంటి పరిస్థితులు రావచ్చనిపిస్తున్నది. కాబట్టి ముందు ఈ ప్రమాదానికున్న అవకాశాలను పూర్తిగా తొలగించాలి. అందుకు ఇంకా ఎంతో పటిష్ఠమైన భద్రతా వ్యవస్థ మనకు అవసరం’
-శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్