ముంబై, నవంబర్ 15: జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు, ఉద్యోగులు మూకుమ్మడి సెలవు పెట్టనున్నారు. వేతన సవరణను కోరుతూ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ రిజర్వ్ బ్యాంక్ అధికారులు, ఉద్యోగుల ఐక్య మండలి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్కూ లేఖ రాసింది. ఈ క్రమంలోనే నిరసన తప్ప మరో మార్గం లేక ఈ సామూహిక సెలవుకు దిగుతున్నామని ఓ ప్రకటనలో ఐక్య మండలి స్పష్టం చేసింది. సిబ్బందికి జీతాలు పెంచక నాలుగేండ్లపైనే అవుతున్నదని ఇందులో పేర్కొన్నది. కాగా, ఈ నిరసనలో అఖిల భారత రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐఆర్బీఈఏ), అఖిల భారత రిజర్వ్ బ్యాంక్ కార్మికుల సమాఖ్య (ఏఐఆర్బీడబ్ల్యూఎఫ్), ఆర్బీఐ అధికారుల సంఘం (ఆర్బీఐవోఏ), అఖిల భారత రిజర్వ్ బ్యాంక్ అధికారుల సంఘం (ఏఐఆర్బీవోఏ) పాల్గొంటున్నాయి.
రికవరీలో ఎకానమీ
భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నదని, అంతర్జాతీయ ప్రతికూలతలున్నా.. అనుకూలమైన ద్రవ్య, రుణ పరిస్థితులు కలిసొస్తున్నాయని దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ ఆర్టికల్ తెలిపింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ వేగం పెరుగడం కూడా కలిసొచ్చే అంశాలేనని ఈ నెల ఆర్బీఐ బులెటిన్లో ప్రచురితమైన ఆర్టికల్లో పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు కొంతైనా తగ్గడాన్ని ఆహ్వానించిన ఆర్బీఐ.. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్య సాధనకు ఎయిర్ ఇండియా అమ్మకం కీలకమేనన్నది.
భారత్కు ఢోకా లేదు
అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నుంచి ఎదురయ్యే ప్రతికూలతలను తట్టుకునే సామర్థ్యం భారత్కు బాగానే ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖెల్ దేబబ్రత పాత్ర అన్నారు. ప్రస్తుతం భారత స్థూల ఆర్థిక మూలాలు చెప్పుకోదగ్గ స్థాయిలో బలపడ్డాయని చెప్పారు. కాబట్టి విదేశీ పరిస్థితులు ఎలా ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఇబ్బందేమీ లేదని సోమవారం ఇక్కడ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ‘బ్రిక్స్ దేశాల్లో వృద్ధి, అభివృద్ధి’ అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ అన్నారు.
కొనసాగుతున్న డాలర్ కొనుగోళ్లు
ఈ ఏడాది సెప్టెంబర్లోనూ రిజర్వ్ బ్యాంక్.. డాలర్లను నికరంగా కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. స్పాట్ మార్కెట్ నుంచి 791 మిలియన్ డాలర్లను కొనుగోలు చేసింది. సెప్టెంబర్లో 8.378 బిలియన్ డాలర్లను మార్కెట్లో అమ్మిన ఆర్బీఐ.. తిరిగి అక్కడ్నుంచే 9.169 బిలియన్ డాలర్లను కొనుగోలు చేసినట్లు ఆర్బీఐ తాజా వివరాలనుబట్టి తెలుస్తున్నది. ఆగస్టులో 3.747 బిలియన్ డాలర్లను కొన్న విషయం తెలిసిందే.