న్యూఢిల్లీ, మే 5: అమెరికా కేంద్రస్థానంగా ఐటీ సేవలు అందిస్తున్న కాగ్నిజెంట్..మార్చితో ముగిసిన తొలి త్రైమాసికానికిగాను 563 మిలియన్ డాలర్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన 505 మిలియన్ డాలర్లతో పోలిస్తే 11.48 శాతం అధికం. సంస్థ భారత్ నుంచి కార్యకలాపాలు చేపడుతున్నది. ముఖ్యంగా మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం ఇక్కడి నుంచే పనిచేస్తుండటం విశేషం. కాగ్నిజెంట్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది భారత్లో 50 వేల మంది ఫ్రెషర్లను క్యాంపస్ల ద్వారా తీసుకోనున్నట్లు ప్రకటించింది. అలాగే 2022లో 20 బిలియన్ డాలర్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను రచిస్తున్నది. జనవరి-మార్చి మధ్యకాలానికిగాను సంస్థ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 9.65 శాతం పెరిగి 4.82 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. సంస్థకు వచ్చిన మొత్తం ఆదాయంలో డిజిటల్ సేవల్లో 20 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. ప్రస్తుతం సంస్థకు అంతర్జాతీయంగా 3.40 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వీరిలో భారత్లోనే 2.40 లక్షల మంది ఉండటం విశేషం.