Cognizant | ప్రపంచంలోనే పేరొందిన ఐటీ కంపెనీ `కాగ్నిజెంట్` తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 20 వేల మంది ఉద్యోగులు పని చేసేందుకు వీలుగా పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్ ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి, ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు తదితరులు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, కాగ్నిజెంట్ సంస్థ మధ్య ఒప్పందం జరిగింది.
గతేడాది సీఎం బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ది కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్ అన్నారు.
హైదరాబాద్ లో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని రవి కుమార్ పేర్కొన్నారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్ లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.
ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయన్నారు. కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని అన్నారు.
హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర టైర్-2 నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనకు కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్నిస్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి దోహదపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు.