Coffee Day | కాఫీ డే ఎంటర్ప్రైజెస్కు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటరీ కొరడా ఝుళిపించింది. అనుబంధ సంస్థల నుంచి ప్రమోటర్ల కంపెనీలకు నిధులు మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో భారీ జరిమానా విధించింది. రూ.26 కోట్లను 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్ (ఎంఏసీఈఎల్), దాని అనుబంధ కంపెనీల నుంచి రావాల్సిన బకాయిలన్నింటినీ వడ్డీతో కలిపి వసూలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. బకాయిల వసూలు నిమిత్తం సమర్థమైన చర్యలు చేపట్టేందుకు, ఒక స్వతంత్ర న్యాయ సంస్థను నియమించుకోవాలని సూచించింది. కాఫీ డే ఎంటర్ప్రైజెస్కు చెందిన ఏడు అనుబంధ సంస్థల నుంచి కాఫీ డే ప్రమోటరుకు చెందిన మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్కు రూ.3,535 కోట్లు మళ్లించారని సెబీ గుర్తించింది.
మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్ (ఎంఏసీఈఎల్)కు దాని అనుబంధ సంస్థలైన కాఫీ డే గ్లోబల్, టాంగ్లిన్ రిటైల్ రియాల్టీ డెవలప్మెంట్స్, టాంగ్లిన్ డెవలప్మెంట్స్, గిరి విద్యుత్ (ఇండియా), కాఫీ డే హోటల్స్ అండ్ రిసార్ట్స్, కాఫీ డే ట్రేడింగ్, కాఫీ డే ఎకాన్ నుంచి బదిలీ చేసిన నిధులు వీజీ సిద్ధార్థతోపాటు కుటుంబీకులు, సంస్థలకు బదిలీ అయ్యాయని సెబీ పేర్కొంది. బదిలీ చేసిన రూ.3,535 కోట్లలో.. 2022 సెప్టెంబరు 30 నాటికి రూ.110.75 కోట్లు మాత్రమే అనుబంధ సంస్థలు వసూలు చేయగలిగాయని సెబీ పేర్కొంది. అనైతిక వ్యాపార విధానాలు, మోసపూరిత కార్యకలాపాలు, నిబంధనల ఉల్లంఘనను పరిగణనలోకి తీసుకుని, రూ.25 కోట్ల జరిమానాను సెబీ విధించింది. అలాగే నమోదిత, వెల్లడి నిబంధనల ఉల్లంఘనకు గాను మరో రూ.కోటి విధించింది.