న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలు వాటి పాత క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధరకు కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించడంతో దేశంలోని వివిధ నగరాల్లో సీఎన్జీ గ్యాస్ ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు మహానగర్ గ్యాస్ ముంబై నగరంలో సీఎన్జీ ధరను కేజీకి రూ.8 చొప్పున తగ్గిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. హైదరాబాద్లో సీఎన్జీ సరఫరా లైసెన్సు కలిగిన భాగ్యనగర్ గ్యాస్ సవరించిన ధరను వెల్లడించాల్సి ఉంది.
ఇప్పటివరకూ దిగుమతి ధర ఆధారంగా సహజవాయువు ధరను నిర్ణయిస్తుండగా, అంతకంటే 10 శాతం తక్కువ ధరను నిర్దేశించేలా కొత్త ఇండెక్సేషన్ ఫార్ములాను కేంద్రం ఆమోదించింది. ఈ ఫార్ముల్లా ప్రకారం ఏప్రిల్ 8 నుంచి 30 వరకూ సహజవాయువు యూనిట్కు 7.92 డాలర్ల ధరను నిర్ణయించినట్టు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. కానీ ఈ అధికారిక ధర ఎంత ఉన్నప్పటికీ, వినియోగదారులకు అందించే ధర 2025 మార్చి 31 వరకూ 6.5 డాలర్లకు మించకుండా కేంద్ర క్యాబినెట్ పరిమితి విధించింది.