అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్. వ్యాపారాలకు అడ్డా. పరిశ్రమలకు నెలవు. రంగం ఏదైనా.. అందులో హైదరాబాద్కు ప్రముఖ స్థానం ఉండాల్సిందే. అందుకే భాగ్యనగరంపై నిరుద్యోగులు గంపెడాశలు పెట్టుకుంటారు. అందుకు తగ్గట్లే ఈ రాజధాని కూడా అందరికీ కావాల్సినన్ని అవకాశాల్ని ఇస్తున్నది. ప్రపంచాన్ని తలకిందులు చేసిన కరోనా ప్రభావం నుంచీ వేగంగా కోలుకున్న హైదరాబాద్.. మునుపటితో పోల్చితే కొలువుల్లో మరింత దూకుడు పెంచి దూసుకుపోతున్నది. దేశ, విదేశీ పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారుతున్న హైదరాబాద్.. తెలంగాణకేగాక యావత్ భారతానికే బ్రాండ్ ఇమేజ్లా నిలుస్తున్నదిప్పుడు.
ముంబై, సెప్టెంబర్ 8: కరోనా సంక్షోభంలోనూ హైదరాబాద్లో ఉద్యోగావకాశాలు పదిలంగా ఉన్నాయి. కొవిడ్కు ముందున్న పరిస్థితులతో పోల్చితే మరింతగా ఇక్కడి జాబ్ మార్కెట్ బలపడింది. దేశీయ ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీ.కామ్ అనుబంధ విభాగం నౌకరీ జాబ్స్పీక్ తాజా నివేదిక ఇదే చెప్పింది మరి. మహమ్మారి దెబ్బకు అటుఇటుగా అన్ని రంగాలు కుప్పకూలిన విషయం తెలిసిందే. అయినప్పటికీ భాగ్యనగర వ్యాపార, పారిశ్రామిక మూలాలు పరిపుష్ఠంగానే ఉన్నాయి. దీంతో కరోనా ప్రభావ పరిస్థితుల నుంచి వేగంగానే కోలుకోగలిగాయి. ఈ ఉత్సాహం ఉద్యోగ నియామకాల్లోనూ కొనసాగుతున్నదిప్పుడు.
దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో జాబ్ మార్కెట్ రికవరీ గత నెల భారీగా పుంజుకున్నట్లు నౌకరీ జాబ్స్పీక్ వెల్లడించింది. 2019 ఆగస్టుతో పోల్చితే ఈ ఏడాది ఆగస్టులో నియామకాలు 24 శాతం నుంచి 89 శాతానికి పెరిగాయని, హైరింగ్ ఇండెక్స్ ఏకంగా 2,673గా నమోదైందని పేర్కొన్నది. ఈ ఆరు మెట్రో నగరాల్లో ఓవరాల్గా 39 శాతం వృద్ధి ఉండగా, ఒక్కో నగరాన్ని చూస్తే బెంగళూరు తర్వాత హైదరాబాద్దే హవా అని నౌకరీ జాబ్స్పీక్ తెలియజేసింది.
తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి శ్రమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వ్యాపార, పారిశ్రామిక రంగాలకూ పెద్దపీట వేస్తున్నది. ఈ క్రమంలోనే కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనతో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. ముఖ్యంగా స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగాల్లో మెరుగైన అవకాశాలు లభించేలా వారి నైపుణ్యాభివృద్ధిపైనా ప్రత్యేక శ్రద్ధను ప్రభుత్వం కనబరుస్తుండటం విశేషం. మరోవైపు నూతన ఆలోచనలకు సరైన వేదికల్ని అందుబాటులోకి తెస్తూ ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలకూ బాసటగా నిలుస్తున్నది.
ఉద్యోగ నియామకాల్లో ఐటీ రంగ సంస్థలు దూకుడు మీదున్నాయి. హైదరాబాద్లో దాదాపు అన్ని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలకు కార్యాలయాలున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల జరిగిన నియామకాల్లో ఐటీ వాటా 79 శాతం పెరిగినట్లు నౌకరీ జాబ్స్పీక్ తెలిపింది. ఇక కరోనాతో కుదేలైన విద్యా రంగంలోనూ ఉద్యోగాలు పెరిగాయి. 2019తో చూస్తే 102 శాతం వృద్ధి కనిపించింది.
గతేడాది చోటుచేసుకున్న విపత్కర పరిస్థితుల నుంచి బయటపడుతున్నాం. జాబ్ మార్కెట్లో కనిపిస్తున్న రికవరీనే నిదర్శనం. 2019తో పోల్చితే ఈ ఏడాది జనవరి-మే నెలల్లో నిరాశగా ఉన్నా.. ఆ తర్వాతి నెలలు ఆశాజనకంగా ఉన్నాయి. జూన్ నుంచి వృద్ధిరేటు మొదలైంది. ముఖ్యంగా హెచ్ఆర్/అడ్మిన్ నిపుణుల నియామకాలు పెరుగడం.. ఆయా సంస్థల విస్తరణ ప్రణాళికలకు అద్దం పడుతున్నది.
పవన్ గోయల్, నౌకరీ.కామ్ ప్రధాన వ్యాపారాధికారి