CII for Covid Levy | కరోనా మహమ్మారి ఆట కట్టించడానికి ప్రభుత్వానికి చేయూతనిచ్చేందుకు కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ముందుకు వచ్చింది. అన్ని వయస్సుల వారికి కరోనా వ్యాక్సిన్లు, బూస్టర్ డోస్లు ఇవ్వడానికి అవసరమైన నిధుల కోసం అదనంగా ఒకశాతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) లెవీ విధించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్లు ఇవ్వడానికి తప్పనిసరిగా ఏడాది పాటు రెండు శాతం నిధులు ఖర్చు చేసేలా కార్పొరేట్లను ప్రోత్సహించాలని కోరింది. ఈ మేరకు వచ్చే బడ్జెట్లో ప్రతిపాదనలు సమర్పించాలని సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ కోరారు.
కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ఒక్కశాతం అదనపు సీఎస్ఆర్ నిధులు తప్పనిసరి చేయాలని సీఐఐ సూచించింది. 12 నెలల కాలంలో అన్ని వయస్సుల వారికి బూస్టర్ డోస్ వ్యాక్సిన్లు లభ్యమయ్యేలా కార్పొరేట్లు.. అదనంగా ఒకశాతం సీఎస్ఆర్ నిధులు కేటాయించేందుకు బడ్జెట్లో ప్రతిపాదనలు రూపొందించాలని కోరుతున్నట్లు టీవీ నరేంద్రన్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టి పెడతారని సీఐఐ అంచనా వేస్తున్నది.
ఒమిక్రాన్ వల్ల కరోనా కేసులు పెరుగుతున్నా.. హస్పిటలైజేషన్ రేట్ నియంత్రణ స్థాయిలో ఉన్నాయని సీఐఐ పేర్కొన్నది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేందుకు.. ఎకానమీ రికవరి ప్రక్రియ పురోభివృద్ధి కోసం.. కరోనా ఆంక్షలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన ప్రాంతాల్లో స్థానికంగా మాత్రమే ఆంక్షలు కొనసాగించాలని సూచించింది. కరోనా కేసులు హాస్పిటలైజేషన్ 75 శాతం దాటిన మైక్రో కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సీఐఐ లేఖ రాసింది.