హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాబోయే ఐదేండ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ద్విసూత్ర వ్యూహాన్ని అమలు పరుస్తున్నట్టు సీఐఐ సదరన్ రీజియన్ చైర్పర్సన్, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. కొత్త కంపెనీలను ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానించడం, ప్రస్తుతమున్న కంపెనీలను విస్తరించడం అనే ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నామన్నారు.
బుధవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వచ్చే ఐదేండ్లలో దేశంలోని దక్షిణాది రాష్ర్టాల్లో 25 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ద్విసూత్ర వ్యూహాన్ని అమలు చేస్తున్నదన్నారు. దీనిలో భాగంగానే తెలంగాణలో 5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి అవసరమైన సానుకూల విధానాల రూపకల్పన కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందించడమే ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో సీఐఐ ప్రాధాన్యత అంశమని తెలిపారు. తెలంగాణతోసహా దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలతో సీఐఐ సంప్రదింపుల కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న ఫార్మా, ఆయుర్వేద, రక్షణ, విమానయాన, విద్యుత్తు పరికరాలు, ఏఐ, రోబోటిక్స్, మోటరు వాహనాలు, వస్త్ర తయారీ, పర్యాటక రంగాలపై సీఐఐ దృష్టి సారిస్తుందన్నారు. కాగా, మధ్యతరగతి కంపెనీల ప్రగతి కోసం ఆ కంపెనీల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చే లైట్ హౌజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టినట్టు స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో ఐటీ, విజ్ఞాన వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఆగస్టు 2న ఫుడ్ ప్రో అనే ఎక్స్పోను చెన్నైలో నిర్వహిస్తున్నామన్నారు.