China | కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ కుదేలు.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం.. పెరిగిపోయిన వివిధ ముడి సరుకుల ధరలు.. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు.. ఫలితంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశం చైనాలో ఇండ్ల కొనుగోళ్లు పూర్తిగా పడిపోయాయి. గత జనవరి నుంచి జూన్ వరకు ఇండ్ల కొనుగోళ్లు 25 శాతం పడిపోయాయి. ఇండ్ల కొనుగోలు దారులు ముందుకు రాకపోవడంతో భారీ స్థాయిలో ఇండ్లు పడావు పడి ఉన్నాయట. దీంతో ఇప్పటికే పీకల్లోతు వివిధ అంతర్జాతీయ రుణ సంస్థల నుంచి తీసుకున్న రుణాల భారంతో సంక్షోభంలో చిక్కుకున్న రియాల్టీ డెవలపర్లు ప్రత్యామ్నాయ మార్గాల వైపు లుక్కేశారు.. గ్రామీణులు, త్రీటైర్, ఫోర్టైర్ నగరాల ప్రజలను ఆకర్షించేందుకు.. సొంతిండ్ల కొనుగోలు దారుల నుంచి డౌన్ పేమెంట్స్ కోసం పుచ్చకాయలు ( watermelons ), వెల్లుల్లి, గోధుమలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల తీసుకుంటున్నారట. ఇది చైనా అధికార దిన పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసిన వార్తాకథనం సారాంశం.
నాంజింగ్లోని ఒక డెవలపర్ ఇండ్ల కొనుగోలుదారుల చెల్లింపులకు 20 యువాన్ల కింద ఒక పుచ్చకాయ తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారని ఆ పత్రిక తెలిపింది. తదుపరి మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వ్యవసాయ ఉత్పత్తుల రూపంలో చెల్లింపులను సస్పెండ్ చేశారని వార్తలొచ్చాయి. అంతే కాదు.. ఈ తరహా ఆల్టర్నేటివ్ పేమెంట్స్ను ప్రోత్సహిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్లనూ డిలిట్ చేసేశారు. గత నెల 28 నుంచి ఈ నెల 15 వరకు అమల్లో ఉన్న ఒక ప్రమోషనల్ ఈవెంట్ ప్రకారం.. ప్రాపర్టీ డెవలపర్లు గరిష్ఠంగా లక్ష యువాన్లకు 5000 పుచ్చకాయలు తీసుకుంటున్నారు. స్థానిక పుచ్చకాయల రైతులను ప్రోత్సహించడానికి ఈ ప్రమోషనల్ ఆఫర్ తీసుకొచ్చినట్లు వార్తలొచ్చాయి.
23,900 డాలర్ల (1.60 లక్షల యువాన్ల) చెల్లింపునకు గోధుమలు ఇస్తున్నారట. ఇండ్ల ధరలు 89,550 (6 లక్షల యువాన్లు) డాలర్ల నుంచి 1,34,300 (9 లక్షల యువాన్లు) డాలర్లు పలుకుతున్నాయి. ఇండ్ల కొనుగోలుకు గోధుమల చెల్లింపు ప్రమోషన్ స్కీం ఈ నెల 10 వరకు ఉన్నది. హెనాన్ ప్రావిన్స్లోని మిన్క్యూయన్ కౌంటీలో ఈ ఆఫర్ అమలవుతున్నది. కానీ, సోషల్ మీడియా వీచాట్ అకౌంట్ నుంచి ఈ ప్రమోషన్ పోస్ట్లు డిలిట్ చేశారట.
ముందస్తుగా నగదు రూపంలో ఇండ్ల కొనుగోలుదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించొద్దని చైనా సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇండ్ల కొనుగోలు కోసం ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వారు.. తాజాగా జీ జిన్పింగ్ సర్కార్ ఆదేశంతో రియాల్టీ సంస్థలు ఈ ప్రత్యామ్నాయ పేమెంట్స్ పద్దతులు అవలంభిస్తున్నాయని తెలుస్తున్నది.
చైనా రియాల్టీ సంస్థల రుణ భారం 10 లక్షల కోట్ల డాలర్లపై చిలుకే. చైనా బ్యాంకుల్లోని 27 శాతం రుణాలు రియల్ ఎస్టేట్ సంస్థలు తీసుకున్నవేనని పాలసీ రీసెర్చ్ గ్రూప్ నివేదించింది. 2008లో తలెత్తిన ప్రైమ్ హోం సంక్షోభం తర్వాత అమెరికాలో దాదాపు 6.5 కోట్ల ఇండ్లు కొనే వారు లేక పడావు పడి ఉన్నాయి. చైనాలో భారీగా ఉద్యోగాలు కల్పించిన రియాల్టీ సంస్థలు నిర్మించిన ఇండ్ల పరిస్థితి ఇప్పుడు లేమాన్ బ్రదర్స్ సంక్షోభాన్ని గుర్తుకు తెస్తున్నది.
మొత్తం బ్యాంకు రుణాల్లో నాలుగోవంతు పై చిలుకు రియాల్టీ సంస్థలవి కావడంతో చైనా సర్కార్ గతేడాది అప్రమత్తమైంది. ఇండ్ల ధరలు పెరుగకుండా అడ్డుకునేందుకు రియాల్టీ సంస్థలపై కొరడా ఝుళిపించింది. ఫలితంగా, జాతీయంగా అంతర్జాతీయంగా వివిధ సంస్థల నుంచి బాండ్ల రూపేణా సేకరించిన రుణాల చెల్లింపులు పూర్తిచేయలేక ఎవర్గ్రాండే వంటి సంస్థలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. తాజాగా ఆ జాబితాలో షాంఘై కేంద్రంగా పని చేస్తున్న సంస్థ షిమాగో గ్రూప్ చేరింది. ఆదివారం నాటికి 100 కోట్ల డాలర్ల నగదు అసలు, వడ్డీ చెల్లించలేక చేతులెత్తేసింది. ఈ విషయమై హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో సమాచారం ఇచ్చింది. ఈ బకాయి చెల్లింపునకు ఎటువంటి గ్రేస్ పీరియడ్ కూడా లేకపోవడం గమనార్హం.