ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతున్న చైనా చిక్కుల్లో పడిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కొంతకాలంగా ‘డ్రాగన్’ కొంత కాలంగా ఆర్థిక పరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదని నివేదికలు వస్తున్నాయి. ఈ సంగతి నిజమేనని అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) అంగీకరించింది. దీనికి గిరాకీ తగ్గడంతోపాటు కొన్ని అనిశ్చిత అంశాలే కారణమని పేర్కొన్నది. జూలైలో జరిగే సీపీసీ సెంట్రల్ కమిటీ సమావేశంలో ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలపై చర్చించాలని నిర్ణయించింది.
కరోనా మహమ్మారితోపాటు రోజురోజుకు తీవ్రమవుతున్న ప్రాపర్టీ మార్కెట్ సంక్షోభంతో చైనా ఆర్థిక వ్యవస్థలో మందగమనం కొనసాగుతున్నది. దేశీయంగా, అంతర్జాతీయంగా చైనా సంస్థలు ఎదుర్కొంటున్న కష్టాలను తాజాగా జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ప్రస్తావించిన అధ్యక్షుడు జీ జిన్ పింగ్.. దేశీయ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటున్నదని అంగీకరించారు. గిరాకీ తగ్గిపోవడంతోపాటు సంస్థలకు ఎదురవుతున్న నిర్వహణ భారం, బాహ్య రంగంలో నెలకొన్న అనిశ్చితి వంటి సవాళ్ల గురించి సమావేశంలో జీ జిన్ పింగ్ హెచ్చరించారని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.
నిర్వహణ భారంతో సతమతం అవుతున్న పలు వ్యాపార సంస్థలు.. విదేశాలకు తరలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జీ జిన్ పింగ్ చెప్పినట్లు తెలుస్తున్నది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి క్రుషి చేస్తానని ఆయన అన్నట్లు వినికిడి. దేశీయ, సామాజిక, ఆర్థిక విధానాల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాలని సీపీసీ పొలిట్ బ్యూరో సమావేశంలో జిన్ పింగ్ పిలుపునిచ్చారని చైనా మీడియా సంస్థలు తెలిపాయి.