తక్షణ ఆర్థిక అవసరాలకు ఎవరికైనా టక్కున గుర్తొచ్చేవీ బంగారాన్ని తనఖాపెట్టి తీసుకునే రుణాలే. వైద్య ఖర్చులకు, శుభకార్యాలకు, చదువు కోసం చాలామంది పసిడి రుణాలకే మొగ్గుచూపుతున్నారు. తక్కువ వడ్డీకే ఈ రుణాలు లభిస్తుండటం, డాక్యుమెంటేషన్ లేకపోవడం, నిమిషాల్లో నగదు చేతికందుతుండటం వీటి ప్రత్యేకత. అందుకే బంగారంపై రుణాలు అత్యంత ఆదరణను సంపాదించుకున్నాయి. ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితుల్లో ఇతర రుణాల లభ్యత కష్టతరమైన నేపథ్యంలో తాకట్టు ద్వారా బంగారు నగలపై తీసుకునే రుణాలే అందరికీ దిక్కయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఈ రుణాలకు ఈఎంఐ సదుపాయం కూడా ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు కల్పిస్తున్నాయి.
ముందు ఇవి గమనించండి..
మీ బంగారాన్ని తనఖా పెట్టే ముందు కొన్నింటిని పరిశీలించడం ముఖ్యం. ఎక్కడ వడ్డీరేట్లు తక్కువగా ఉన్నాయి?, గ్రాముపై గరిష్ఠంగా ఎంత రుణం ఇస్తున్నారు?, రుణ కాలపరిమితి ఎంత?, ఇతర చార్జీలు ఎమైనా పడుతున్నాయా?, ప్రాసెసింగ్ ఫీ, ఆలస్య చెల్లింపులపై చార్జీలు, వడ్డీ చెల్లించకపోతే పడే జరిమానాలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, ప్రస్తుతం నెలకొన్న పోటీ దృష్ట్యా పలు సంస్థలు.. రుణాలపై వడ్డీని క్రమం తప్పకుండా చెల్లిస్తున్న కస్టమర్లకు రాయితీలు అందిస్తున్నాయి. వడ్డీరేటుపై 1 శాతం నుంచి 2 శాతం వరకు రిబేటు ఇస్తున్నారు. ఇక బంగారంపై రుణాల కాలపరిమితి కనీసం 3 నెలల నుంచి గరిష్ఠంగా 48 నెలల వరకున్నది. తిరిగి చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలంలో అమ్ముకుని రుణ బకాయిలను బ్యాంకర్లు, ఆయా సంస్థలు రాబట్టుకుంటాయన్న విషయం తెలిసిందే.