Rangareddy District | రంగారెడ్డి, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. సులభతర అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో జిల్లాకు భారీ పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించాలన్న సంకల్పంతో ఇక్కడ కొత్త యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. సీతారాంపూర్లో రూ.1,200 కోట్ల పెట్టుబడితో కిటిక్స్ గ్రూప్ తమ రెండో యూనిట్ను నెలకొల్పుతుండగా, రూ.272 కోట్ల పెట్టుబడితో సింటెక్స్ సంస్థ చందనవెల్లిలో మూడో యూనిట్ను తెస్తున్నది. వీటికి గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఆయా కంపెనీల చైర్మన్లతోపాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి కూడా హాజరవుతున్నారు.
సింటెక్స్ సంస్థ ఇప్పటికే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందనవెల్లిలో వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్, వెల్స్పన్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ పేరిట రెండు యూనిట్లను నెలకొల్పింది. వెల్స్పన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్.. రూ.1,200 కోట్ల పెట్టుబడితో ఈ రెండు యూనిట్లను ఏర్పాటు చేసింది. శంకుస్థాపన చేసిన 14 నెలలకే 2019 సెప్టెంబర్లో ఉత్పత్తులను ప్రారంభించింది. ప్లాస్టిక్ పైపులు, ఆటో కంపోనెంట్స్, వాటర్ ట్యాంకుల తయారీలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ.. ఇదే ప్రాంతంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు నిర్ణయించుకున్నది. ఇందులో భాగంగానే రూ.272 కోట్లతో ఇప్పుడు మూడో యూనిట్కు శ్రీకారం చుడుతున్నది. 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ ద్వారా మరో 650 మందికి ఉద్యోగావకాశాలను సంస్థ కల్పించనున్నది. ఇక దుస్తుల తయారీ సంస్థ కిటెక్స్ గ్రూప్.. ఇప్పటికే వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో మొదటి యూనిట్ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు రెండో యూనిట్ను 250 ఎకరాల్లో రూ.1,200 కోట్లతో షాబాద్ మండలం సీతారాంపూర్లో భారీ స్థాయిలో తీసుకువస్తున్నది. ఈ యూనిట్ ద్వారా ఏకంగా 11వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇందులో 80 శాతం ఉద్యోగాలను మహిళలకే ఇవ్వనున్నట్టు సంస్థ ప్రతినిధులు చెప్తుండటం విశేషం.
పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. టీఎస్ ఐపాస్తో సులభంగా అనుమతులను మంజూరు చేస్తున్నది. భారీగా స్థలాల కేటాయింపుతోపాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. నిరంతర విద్యుత్తు, వాటర్గ్రిడ్ పైపుల ద్వారా నీటిని అందిస్తున్నది. ఈ నేపథ్యంలోనే పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ఇది రంగారెడ్డి జిల్లాకు కలిసొస్తున్నది. ఇప్పటిదాకా జిల్లాలో రూ.47,062 కోట్ల పెట్టుబడులతో 1,252 పరిశ్రమలు ఏర్పాటైయ్యాయి. 5,15,851 మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు దక్కాయి.