ఈ సెప్టెంబర్లోగా తీసుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ, మార్చి 31: కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రథమార్ధంలో రూ.8.45 లక్షల కోట్ల రుణాలను మార్కెట్ నుంచి పొందాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఈ మేరకు ఏప్రిల్-సెప్టెంబర్లో రుణ సమీకరణ ఉంటుందని గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో డేటెడ్ సెక్యూరిటీల ద్వారా రూ.14.31 లక్షల కోట్ల రుణాలను మోదీ సర్కారు తీసుకోవచ్చని అధికారిక అంచనా.
614.9 బిలియన్ డాలర్లకు..
భారత విదేశీ రుణ భారం నిరుడు డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో 11.5 బిలియన్ డాలర్లు పెరిగి 614.9 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వాణిజ్య బ్యాంకులు, ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు తదితర విదేశీ రుణదాతల నుంచి ఈ రుణాలను పొందడం జరిగింది.
పెరిగిన క్యాడ్
దేశీయ కరెంట్ ఖాతా లోటు డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 23 బిలియన్ డాలర్లు లేదా జీడీపీలో 2.7 శాతానికి ఎగిసిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలియజేసింది. దేశ ఎగుమతుల కంటే వస్తు, సేవల దిగుమతుల విలువ అధికంగా ఉండటమే కరెంట్ ఖాతా లోటుగా పరిగణిస్తారు. ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ఫిబ్రవరి ముగిసే నాటికి మొత్తం వార్షిక బడ్జెట్ లక్ష్యంలో 82.7 శాతం లేదా రూ.13,16,595 కోట్లుగా ఉన్నది.