ఖాతాదారులకు ఈపీఎఫ్వో ఓ శుభవార్త చెప్పడానికి సమాయత్తం అవుతున్నది. త్వరలో కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో వచ్చే నెలలో జరిగే సమావేశంలో చర్చించి ఒక నిర్ణయాన్ని ప్రకటించనున్నది. ప్రస్తుతం ఉన్న కనీస పెన్షన్ను రూ.1,000 నుంచి రూ.9,000లకు పెంచేలా సమావేశపు అజెండాను సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి అనేక దఫాలుగా ఇప్పటికే చర్చలు జరిగాయి. పెన్షనర్లు ఎప్పట్నుంచో కనీస పెన్షన్ పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులను దృష్టిలో పెట్టుకొని కూడా ఈపీఎఫ్వో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద కొత్త వేతన కోడ్, కనీస పెన్షన్ అంశాలనే ప్రధానంగా సమావేశంలో చర్చించనున్నారు. గత మార్చిలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కనీస పెన్షన్ను రూ.3,000లకు పెంచాలని సిఫార్సు చేసింది. పెన్షనర్లు మాత్రం రూ.9,000లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.