చైనాలో తయారుచేసి భారత్లో అమ్ముతామంటే ఒప్పుకోం
టెస్లాకు కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: చైనాలో కార్లు తయారు చేసి భారత్లో అమ్ముకుంటామంటే కుదరదని అమెరికా ఈవీ దిగ్గజం టెస్లాకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. భారత్లో తమ ఈవీలను తయారు చేసేందుకు టెస్లా సిద్ధమైతే ఎటువంటి సమస్యా లేదన్న గడ్కరీ.. చైనా నుంచి మాత్రం కార్ల దిగుమతిని ఎట్టిపరిస్థితుల్లోనూ చేసుకోరాదన్నారు. ‘రైసినా డైలాగ్’ సందర్భంగా మంగళవారం ఓ ఇంటరాక్టివ్ సెషన్లో మాట్లాడుతూ.. ఈవీలకు భారత్ ఎంతో అనువైన మార్కెట్ అన్నారు. ఈ క్రమంలోనే ‘ఒకవేళ ఎలాన్ మస్క్ (టెస్లా సీఈవో) భారత్లో ఉత్పత్తికి సిద్ధమైతే ఎటువంటి సమస్య లేదు. భారత్కు రావచ్చు. తయారీని మొదలుపెట్టవచ్చు.
భారత్ అతిపెద్ద మార్కెట్. ఇక్కడి నుంచి విదేశాలకు ఈవీలను ఎగుమతి కూడా చేసుకోవచ్చు. కానీ చైనాలో తయారుచేసి భారత్లో అమ్ముకోవాలనుకుంటే అది సరైన ఆలోచన కాదు’ అన్నారు. కాగా, ముందు భారత్లో ఈవీలను తయారుచేయాలని, ఆ తర్వాత పన్ను రాయితీలను పరిశీలిస్తామని ఇప్పటికే టెస్లాకు కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విదేశాల్లోనే పూర్తిగా తయారై భారత్కు దిగుమతి అవుతున్న కార్లపై 60 నుంచి 100 శాతం కస్టమ్స్ సుంకం పడుతున్నది.
ముందస్తు చర్యలు తీసుకోండి
ఇటీవలికాలంలో ఎలక్ట్రిక్ టూవీలర్లు మంటల్లో చిక్కుకుపోతుండటం, ప్రాణనష్టానికీ దారితీస్తున్న నేపథ్యంలో లోపాలున్న వాహనాలను సరిచేసే పనిలో పడాలని ఆయా కంపెనీలకు గడ్కరీ సూచించారు. ఇందులోభాగంగానే ముందస్తు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రస్తుతం ఎండాకాలం కావడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు బ్యాటరీలకు సమస్యగా పరిణమించాయన్నారు. ఏదిఏమైనా భద్రతకే తొలి ప్రాధాన్యతన్నారు. కస్టమర్ల రక్షణకు కంపెనీలు పెద్దపీట వేయాలని కోరారు.