ఉద్యోగుల జీతం, పని గంటలు, పన్నులు తదితరాలకు సంబంధించి వచ్చే నెల 1 నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న కార్మిక చట్టాల అమలు జూలై నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తున్నది మరి. అయితే కొన్ని రాష్ర్టాలు ఇందుకు ఇంకా అంగీకరించాల్సి ఉన్నది. చట్టాలతో ప్రభావిత అంశాల గురించి చెప్పుకోవాలంటే..
1. ఉద్యోగుల రోజువారీ పని గంటల్ని పెంచాలని, వారానికి సెలవు దినాల్నీ ఎక్కువ చేయాలని కొత్త వేతన చట్టంలో ప్రతిపాదించారు. అలాగే స్థూల వేతనంలో బేసిక్ 50%గా ఉండాలని ఉద్దేశించారు. దీంతో ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా మీరు పొందే నెలసరి వేతనం తగ్గవచ్చు.
2. ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) పెరగవచ్చు. విజృంభించిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆధారంగా డీఏను సర్కారు సవరించే వీలున్నట్టు చెప్తున్నారు. ఏటా జనవరి, జూలైల్లో ప్రభుత్వం డీఏను ప్రకటిస్తున్నది.
3. అమ్మకాలను పెంచుకోవడం కోసం చేసే వ్యాపారం నుంచి పొందే ప్రయోజనాలకూ టీడీఎస్ వర్తించనున్నది. ఉదాహరణకు సోషల్ మీడియా ప్రభావశీలురకు వచ్చే ఉచిత విమాన లేదా ఐపీఎల్ టిక్కెట్లు, డాక్టర్లు అందుకునే శాంపిల్ మెడిసిన్స్కూ పన్నుపోటు తప్పదు.
4. జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల టోకెనైజేషన్, కో-బ్రాండింగ్ నిబంధనల్ని మూడు నెలలపాటు ఆర్బీఐ వాయిదా వేసింది.