IDBI Bank Privatisation | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వ వాటా విక్రయ ప్రారంభమైంది. బ్యాంకులో కేంద్రం.. 60.72 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఐడీబీఐ బ్యాంకులో కేంద్రానికి 45.48 శాతం, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)కి 49.24 శాతం వాటాలు ఉన్నాయి. ప్రభుత్వవాటాల కొనుగోలుకు ఆసక్తి గల ఇన్వెస్టర్ల నుంచి కేంద్రం బిడ్లను ఆహ్వానించింది. బిడ్లు దాఖలు చేయడానికి డిసెంబర్ 16 చివరి తేదీ.
ఎల్ఐసీకి గల 49.24 శాతం వాటా ప్రకారం 529.41 కోట్ల షేర్లు, కేంద్రానికి గల 45.48 శాతం వాటాకు అనుగుణంగా 488.99 కోట్ల షేర్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 30.24 శాతం ప్రభుత్వ, 30.48 శాతం ఎల్ఐసీ వాటాలను విక్రయిస్తారు. బ్యాంకు వాటాల ఉపసంహరణతోపాటు యాజమాన్య నియంత్రణ హక్కుల బదిలీ ప్రక్రియ కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్నది.
ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఐడీబీఐ షేర్ విలువ రూ.42.70 వద్ద నిలిచింది. నిర్దేశిత వాటాల విక్రయం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.27,800 కోట్ల నిధులు సమకూరతాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో రూ.65 వేల కోట్ల వాటాలను ఉపసంహరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది.