BSNL | ఓ కారు విలువ పది లక్షలు. మరో 5 లక్షలు వెచ్చించి మెరుగులు దిద్దారు. ఆ తర్వాత 2 లక్షలకే కారుచౌకగా అమ్మేశారు. ఈ డీల్తో కొనుగోలుదారు లాభం పొందినట్లేగా. ప్రభుత్వ రంగ సంస్థలను అగ్గువసగ్గువకు తెగనమ్ముతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ‘బీఎస్ఎన్ఎల్’ విషయంలో ఈ సూత్రాన్నే పాటిస్తున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పునరుత్థానం కోసం రూ.89,047 కోట్ల విలువైన ప్యాకేజీని ఇస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. 2019 నుంచి ఇప్పటివరకూ మూడు విడుతల్లో రూ.3.22 లక్షల కోట్ల మొత్తాన్ని సంస్థ పునరుజ్జీవనానికి కేటాయించినట్టు గొప్పగా ప్రచారం చేసుకొంటున్నది. అయితే బీఎస్ఎన్ఎల్ను ప్రైవేటీకరణ చేస్తామంటూ వీఆర్ఎస్ పేరిట ఉద్యోగులను సాగనంపిన కేంద్రం.. అదే సంస్థకు ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీలను ప్రకటిస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది. ప్రైవేట్ టెలికం కంపెనీలతో పోటీపడకుండా బీఎస్ఎన్ఎల్ను నిర్వీర్యం చేసింది కేంద్ర ప్రభుత్వమేనన్నది అందరికీ తెలిసిందే. అలాంటి సర్కారే.. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ను ఆదుకొనేందుకు లక్షల కోట్ల రూపాయలను వరదలా ఎందుకు పారిస్తుందన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వానిదే పాపం
రెండు దశాబ్దాల క్రితం బీఎస్ఎన్ఎల్ నుంచి ల్యాండ్ ఫోన్ కనెక్షన్ పొందడమే గగనం. సెల్ఫోన్లు ఎప్పుడైతే విపణిలోకి వచ్చాయో.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రైవేటు టెలికం కంపెనీలు మొబైల్ సేవల కోసం పెద్దయెత్తున దరఖాస్తు చేసుకొన్నాయి. స్పెక్ట్రమ్ లైసెన్సుల ఫీజులు, సేవా రుసుము, అనుమతుల ద్వారా భారీగా ఆదాయం లభిస్తుండటంతో ప్రైవేటు సంస్థలను కేంద్రం ఎంతగానో ప్రోత్సహించింది. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ను నిర్లక్ష్యం చేసింది. సరైన సమయంలో స్పెక్ట్రమ్ అనుమతులు ఇవ్వలేదు. దీంతో కస్టమర్ బేస్ను పెంచుకోవడంలో బీఎప్ఎన్ఎల్ వెనుకబడింది. 2016లో టెలికం కంపెనీలు 4జీ సేవలను ప్రారంభించాయి. ఇప్పుడు 5జీ సేవలు అందిస్తున్నాయి. అయితే బీఎస్ఎన్ఎల్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో 4జీ సర్వీసులు ప్రారంభం కాలేదు. ఈ లెక్కన ప్రైవేట్ నెట్వర్క్లతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ఏడేండ్లు లేటు. ఈ పాపం కేంద్రానిదే. స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో బీఎస్ఎన్ఎల్పట్ల ప్రభుత్వం చూపించిన వివక్ష కారణంగానే ఆదాయం రాకపోవడంతో సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ప్యాకేజీ మర్మమిదేనా?
పోటీలో వెనుకబడినప్పటికీ ప్రైవేటు కంపెనీలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ టెలివిజన్ రంగాల్లో బీఎస్ఎన్ఎల్దే పైచేయి. పైగా దేశవ్యాప్తంగా సంస్థకు రూ.4 లక్షల కోట్లకుపైగా ఆస్తులున్నాయి. 8 లక్షల కిలోమీటర్ల మేర ఓఎఫ్సీ ఉన్నది. 66 వేల టవర్లున్నాయి. ఇప్పటివరకూ కవరేజి లేని గ్రామీణ ప్రాంతాలకు 4జీ సర్వీసుల్ని అందించాలంటే ప్రైవేటు కంపెనీలు లక్షల కోట్లు వెచ్చించాలి. అయితే ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వ్యవస్థ ఉన్న బీఎస్ఎన్ఎల్కు అంత ఖర్చు చేయాల్సిన పనిలేదు. అందుకే ఈ సేవలను మరింతగా పెంచడానికి కేంద్రం తాజాగా ప్యాకేజీ ప్రకటించింది. పౌరులు, పన్ను చెల్లింపుదారుల డబ్బుతో బీఎస్ఎన్ఎల్ మౌలిక సదుపాయాలను ఒకవిధంగా కేంద్రం మెరుగుపరుస్తున్నది. అయితే కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చడానికే ప్రైవేటీకరణ జాబితాలో ఉన్న బీఎస్ఎన్ఎల్ను కేంద్రం ఇప్పుడు ఉన్నపళంగా పరిపుష్టం చేస్తున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పౌరుల డబ్బుతో కొత్తగా జవసత్వాలు అద్దిన బీఎస్ఎన్ఎల్ను సరైన సమయంలో ప్రైవేటుపరం చేసి కేంద్రం చేతులు దులుపుకోవడం ఖాయమని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎయిరిండియా విక్రయాన్ని ఈ మేరకు ఉదహరిస్తున్నారు.