NPS Panel | నూతన పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) పనితీరు మెరుగుదలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్థికబిల్లు-2023కి లోక్సభ ఆమోదం సందర్భంగా శుక్రవారం ఆమె ఈ ప్రకటన చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ కమిటీ కృషి చేస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీల సారధ్యంలోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వోద్యోగుల కోసం పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఎన్పీఎస్ అమలు తీరుపై మెరుగుదలకు కేంద్రం కమిటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇప్పటికే రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రభుత్వాలు పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) అమలు చేస్తామని కేంద్రానికి తెలిపాయి.
`ప్రభుత్వోద్యోగుల కోసం అమలు చేస్తున్న నేషనల్ పెన్షన్ స్కీంలో వారి అవసరాలు మెరుగు పర్చాలని ఉద్యోగ సంఘాల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. సామాన్య పౌరుల హక్కులు కాపాడుతూనే ఉద్యోగుల అవసరాలను పరిష్కరించడానికి ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతోనే విధానం రూపొందిస్తాం` అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2004 జనవరి తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఎన్పీఎస్లో ఓపీఎస్ బెనిఫిట్లు కల్పిస్తున్నా.. అవి మార్కెట్ లావాదేవీల ఆధారంగా వర్తిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
ఓపీఎస్ కింద రిటైరైన ప్రభుత్వోద్యోగులు తమ చివరి శాలరీలో సగం పెన్షన్గా అందుకుంటారు. తర్వాత `డీఏ`కు అనుగుణంగా పెన్షన్ పెరుగుతూ ఉంటుంది. కొత్త పెన్షన్ స్కీం అమల్లోకి వచ్చాక ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన పథకాల కింద ఆస్తుల విలువ ఈ నెల నాలుగో తేదీ నాటికి రూ.8.81 లక్షల కోట్లకు చేరుకున్నది. అయితే 2004 జనవరి ఒకటో తేదీ తర్వాత సర్వీసులో చేరిన ప్రభుత్వోద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలన్న ప్రతిపాదన పరిగణనలోకి తీసుకోవట్లేదని ఇటీవలే పార్లమెంట్కు కేంద్రం వెల్లడించింది.
సైన్యం మినహా 2004 జనవరి తర్వాత సర్వీసులో చేరిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు ఎన్పీఎస్ అమలవుతున్నది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ -PFRDA) వెల్లడించిన డేటా ప్రకారం పశ్చిమ బెంగాల్, తమిళనాడు మినహా 26 రాష్ట్రలు ఎన్పీఎస్ను నోటిఫై చేశాయి. 2009 మే ఒకటో తేదీ తర్వాత ప్రతి సిటిజన్ కూడా స్వచ్ఛందంగా ఎన్పీఎస్లో చేరేందుకు కేంద్రం అనుమతించింది. 2015 జూన్ నుంచి అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చినప్పటి నుంచి సామాజిక భద్రతా పథకాలకు ఆదరణ ఎక్కువైంది.