న్యూఢిల్లీ, జనవరి 6: ఎర్ర సముద్ర సంక్షోభం ముదిరేకొద్దీ వర్తక, వాణిజ్యంపై పెను భారం పడే వీలుందని గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) శనివారం ఓ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎగుమతిదారులకు షిప్పింగ్, ఇన్సూరెన్స్ వ్యయం పెరుగుతాయన్నది. అందుకే భారతీయ ఎగుమతిదారులకు ఆర్థిక మద్దతును అందించడంపై కేంద్ర ప్రభుత్వం తప్పక దృష్టి సారించాలని అభిప్రాయపడింది. ఈ సంక్షోభం.. షిప్పింగ్ ఖర్చులను 60 శాతం వరకు, బీమా ప్రీమియంను 20 శాతం వరకు పెంచేలా ఉందన్నది.
ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. ఇప్పుడప్పుడే ఈ సమస్య తీరేలా లేదని, దీర్ఘకాలిక రవాణా ఇబ్బందులను భారత్ ఎదుర్కోక తప్పదంటూ.. అందుకు సిద్ధంగా ఉండాల్సిందేనని జీటీఆర్ఐ వ్యాఖ్యానించడం గమనార్హం. ‘వాణిజ్య నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు రవాణా ఖర్చుల్ని మరింతగా పెంచేస్తున్నాయి. సరుకులు సకాలంలో డెలివరీ కావడం లేదు. దీనివల్ల ఎగుమతిదారుల లాభాలు పడిపోతున్నాయి’ అని జీటీఆర్ఐ పేర్కొన్నది.
ముడి చమురు దిగుమతుల రక్షణార్థం ఒమన్, జిబౌటి వంటి సంఘర్షణలకు లోనవుతున్న ప్రాంతాలకు వెలుపల ఉండే పోర్టులపై దృష్టి సారించాలని తమ నివేదికలో జీటీఆర్ఐ సూచించింది. అలాగే పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, మెడిటరేనియన్ తదితర ప్రాంతాల నుంచి ముడి చమురు దిగుమతుల్ని వైవిధ్యపర్చడం కూడా ముఖ్యమేనని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య అవాంతరాలకు గురవుతున్న భారతీయ సంస్థలకు ఆర్థిక సాయం, బీమా పథకాలను కల్పించాలని కోరింది.