హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఒడిశా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించడానికి సింగరేణి సంస్థ సిద్ధమవుతున్నది. మే మొదటి వారం నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేయోచనలో సంస్థ ఉన్నట్లు తెలుస్తున్నది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ర్టాల్లో బొగ్గు తవ్వకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతులు కూడా లభించాయి. నైనీ బ్లాక్నకు సంబంధించి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి స్టేజ్-2 అనుమతులు ఇటీవల లభించాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన చర్యలను సింగరేణి యాజమాన్యం మరింత వేగం పెంచింది.
783 హెక్టార్ల భూమి అటవీ శాఖదే
ఒడిశా లోని నైనీ బొగ్గు బ్లాక్కు సంబంధించి అంగూల్జిల్లాలో 783 హెక్టార్ల భూమి అటవీ శాఖదే ఉంది. ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తికి సంబంధించి కేంద్రం నుంచి స్టేజ్-2 అనుమతులనేవి కీలకంగా మారాయి. కేంద్రం అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతుల కోసం సింగరేణీ సీఎండీ ఎన్ శ్రీధర్ పర్యవేక్షణలో అధికారులు తీవ్రంగా శ్రమించారు. దీంతో నైనీ బొగ్గు బ్లాక్కు సంబంధించి సంపూర్ణమైన అనుమతులు లభించినట్టు అయింది.