Financial times | ‘ఉయ్యాల ఊగి.. ఊగి ఉన్న చోటుకే వస్తుందన్నట్టు’.. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొనే ఏ నిర్ణయమైనా కార్పొరేట్ మిత్రులకు ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీకి లబ్ధి చేకూర్చేలాగే ఉంటుందని మరోసారి రుజువైంది. బ్యాటరీల పరిశ్రమను ప్రోత్సహించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్న మోదీ సర్కార్..కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఈ ప్రోత్సాహకం అంతిమంగా అదానీ గ్రూపునకే ప్రయోజనం చేకూర్చేలా ఉండనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రైతులకు కనీస మద్దతు ధరను ప్రకటించడానికి కూడా లెక్కకు మించిన సమావేశాలను నిర్వహించే కేంద్రప్రభుత్వం కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను యుద్ధప్రాతిపదికన తీసుకొంటున్నది. క్లీన్ ఎనర్జీలో భాగంగా ఎలక్ట్రిసిటీ గ్రిడ్ బ్యాటరీలను తయారుచేసే కంపెనీలకు 2.63 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 21,580 కోట్లు) భారీ ప్రోత్సాహకాన్ని ఇచ్చేందుకు కేంద్రం సమాయత్తమైంది. 2023-30 మధ్యకాలంలో ఈ స్కీమ్ను కొనసాగించడానికి అవసరమైన ప్రతిపాదనలను విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు బ్రిటిష్ డైలీ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచూరించింది. అయితే, కేంద్రం ప్రతిపాదిత స్కీమ్ అదానీ గ్రూప్నకు లబ్ధి చేకూర్చేలా ఉన్నదన్న వార్తలు పెద్దయెత్తున వినిపిస్తున్నాయి.
ప్రతీ మలుపులో అనుమానాలే
పునరుత్పాదక శక్తి విభాగంలో 2030 నాటికి అతిపెద్ద కంపెనీగా అవతరించడమే తమ లక్ష్యమని గత ఏడాది జూన్లో అదానీ గ్రూప్ ఓ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడేండ్లలో ఈ రంగంలో రూ.5.7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు వివరించింది. బ్యాటరీలను తయారు చేయడమే తమ తొలి ప్రాధాన్యతగా తెలిపింది. ఇంతలో హిండెన్బర్గ్ నివేదిక రావడం.. అదానీ గ్రూప్ను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడం జరిగిపోయాయి. అప్పులను తీర్చడానికి విదేశాల్లో కొత్త రుణాల సేకరణను ఆ కంపెనీ ప్రతినిధులు ముమ్మరం చేశారు. మరోపక్క గ్రీన్ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు శ్రీకారం చుట్టారు. ఈ సమయంలోనే.. జమ్ముకశ్మీర్లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 500 పీపీఎం నాణ్యత ఉన్న 59 లక్షల టన్నుల లిథియం నిల్వలను గుర్తించినట్టు కేంద్రప్రభుత్వం గత ఫిబ్రవరిలో కీలక ప్రకటన చేసింది. వీటి విలువను రూ.35 లక్షల కోట్లుగా అంచనా వేసింది.
ఈ లిథియం గనులను వేలం వేయనున్నట్టు, దీని కోసం ప్రైవేట్ కంపెనీలను టెండర్లకు పిలువనున్నట్టు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ తెలిపారు. పీఎస్యూలను కాదని ప్రైవేట్కు టెండర్ అప్పగిస్తామనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ కేంద్రం ఏకపక్షంగానే ముందుకు వెళ్తున్నది. బ్యాటరీల తయారీలో లిథియం అయాన్లే ప్రధానమన్న విషయం తెలిసిందే. 1999 లోనే కశ్మీర్లోని లిథియం నిల్వలను మ్యాపింగ్ చేసినప్పటికీ.. అదానీ గ్రూప్ కష్టాల్లో ఉన్న సమయంలోనే కేంద్రం ఈ నిల్వల గురించి ప్రకటన చేయడం.. టెండర్లను ప్రైవేటుకు అప్పగిస్తామంటూ వెల్లడించడం.. అప్పటికే, లిథియం బ్యాటరీలను తయారు చేస్తామంటూ అదానీ గ్రూప్ ప్రకటించడం.. తాజాగా బ్యాటరీల తయారీకి ప్రోత్సాహకం ఇస్తామంటూ కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేయడం వెరసి.. అదానీ గ్రూప్నకు ప్రయోజనం చేకూర్చేందుకేనని పలువురు విమర్శిస్తున్నారు.