Cement Price | ముంబై, జూన్ 22: ఆకాశాన్నంటిన సిమెంట్ ధరలు దిగిరానున్నాయి. దేశీయ సిమెంట్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3 శాతం వరకూ ధరలు తగ్గించే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ విడుదల చేసిన రిపోర్ట్లో పేర్కొంది. సిమెంట్కు డిమాండ్ ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ, కంపెనీల మధ్య పోటీ పెరగడం, ముడి వ్యయాలు తగ్గడంతో సిమెంట్ రిటైల్ ధర దిగుతుందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 50 కేజీల సిమెంట్ బస్తా రూ.391 ఆల్టైమ్ గరిష్ఠస్థాయికి చేరింది. కొవిడ్ పాండెమిక్ నేపథ్యంలో ఏర్పడ్డ సరఫరా అవాంతరాలు, ముడి పదార్థాలు ముఖ్యంగా థర్మల్ కోల్ ధరలు జోరుగా పెరగడంతో సిమెంట్ ధర ఆకాశాన్నంటింది. ఇప్పుడా ట్రెండ్ రివర్స్ అవుతున్నదని క్రిసిల్ తెలిపింది. మార్కెట్ వాటాను పెంచుకునేందుకు కంపెనీలు పోటీపడుతున్నందున, ఈ ఏడాది ఇప్పటికే సిమెంట్ ధర 1 శాతం దిగివచ్చింది.
ఏడేండ్లలో తొలిసారి
సాధారణంగా వర్షాకాలం మొదలయ్యే ముందు ఏప్రిల్, మే నెలల్లో సిమెంట్ కంపెనీలు ధరలు పెంచుతుంటాయి. కానీ కంపెనీల మధ్య ఏర్పడిన పోటీ దృష్ట్యా ఏడేండ్లలో మొదటిసారిగా 2023 ఏప్రిల్, మేల్లో సిమెంట్ ధరలు పెరగలేదని క్రిసిల్ పేర్కొంది. డిమాండ్ మెరుగ్గా ఉన్నా ఈ సీజన్లో ధరల్ని పెంచకపోవడం గమనార్హమని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్కు డిమాండ్ 8-10 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు క్రిసిల్ డైరెక్టర్ హితాల్ గాంధి చెప్పారు. అయినప్పటికీ ధరలు గత ఏడాదితో పోలిస్తే 2 శాతం వరకూ తగ్గి బస్తా రూ.382-285 స్థాయికి దిగివస్తుందని అంచనా వేశారు.
తగ్గుతున్న బొగ్గు ధరలు
సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు ధరలు తగ్గడం కంపెనీలకు కలిసి వస్తున్నదని క్రిసిల్ తెలిపింది. ఆస్ట్రేలియా బొగ్గు ధరలు గత ఆర్థిక సంవత్సరం 3, 4 త్రైమాసికాల్లో 10 శాతం, 36 శాతం తగ్గాయి. 2022 ఆగస్టు, సెప్టెంబర్ల్లో ఇవి అత్యంత గరిష్ఠ స్థాయికి చేరిన తర్వాత వేగంగా దిగివచ్చాయి. క్రూడ్ ధరకు అనుగుణంగా అంతర్జాతీయంగా పెట్-కోక్ ధర కూడా 13 శాతం పడిపోయింది. ముడి చమురును శుద్దిచేయడం ద్వారా ఉత్పత్తి చేసే పెట్కోక్ ధర మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నట్టు క్రిసిల్ వివరించింది. దీంతో సిమెంట్ ధర క్రమేపీ తగ్గవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.