న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఈ పండుగ సీజన్ అమ్మకాలను కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ ప్రీమియం, మిడ్-ఎండ్ ఉత్పత్తులు పెంచినట్టు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. అమ్మకాలపరంగా 20-30 శాతం, విలువపరంగా 40-50 శాతం వృద్ధి నమోదవుతుందని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) అంచనా వేసింది. ‘మిడ్, ప్రీమియం ఉత్పత్తుల విక్రయాలతో ఈ పండుగ సీజన్ ఆకట్టుకున్నది. వాల్యూమ్ గ్రోత్ కనీసం 30 శాతం, వాల్యూ గ్రోత్ 40-50 శాతంగా ఉండొచ్చు. పండుగ దగ్గరపడుతున్నకొద్దీ అమ్మకాలు వేగంగా పుంజుకొన్నాయి’ సీఈఏఎంఏ అధ్యక్షుడు ఎరిక్ బ్రగాంజా పీటీఐకి తెలిపారు.
ద్రవ్యోల్బణ భయాలున్నా..
ద్రవ్యోల్బణ భయాలున్నా ఈసారి అమ్మకాలు ఆశాజనకంగా ఉండటంపట్ల ఇండస్ట్రీ ఆనందం వ్యక్తం చేస్తున్నది. కరోనా ప్రభావం మధ్య గత రెండేండ్లూ వ్యాపారాలు సాగని పరిస్థితులున్న విషయం తెలిసిందే.
ఎంట్రీ-లెవల్కు లేని ఆదరణ
ఈసారి అమ్మకాల్లో ఆరంభ స్థాయి ధరలున్న వస్తూత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ అంతంతమాత్రంగానే కనిపించింది. అయితే ఇదే సమయంలో ఏసీల విక్రయాలు 38 శాతం, ఎల్ఈడీల అమ్మకాలు 10 శాతం, 4కే టీవీల సేల్స్ 34 శాతం పెరిగాయి. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లకూ గిరాకీ 13 శాతం ఎగిసిందని పానసోనిక్ మార్కెటింగ్ ఇండియా ఎండీ ఫ్యుజిమోరి తెలిపారు.