ముంబై : 2023 ఆర్ధిక సంవత్సరం నుంచి దేశ జీడీపీ 6.5 శాతం నుంచి 7 శాతం వరకూ వృద్ధి చెందుతుందని ప్రధాన ఆర్ధిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ పేర్కొన్నారు. సంస్కరణల ఊతంతో పాటు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం వృద్ధి రేటుకు ఊతమిస్తుందని అన్నారు.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పెద్దగా లేదని ఆయన అంచనా వేశారు. పలు సంస్కరణల ప్రభావం, వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకోవడంతో 2023 ఆర్ధిక సంవత్సరం నుంచి దేశ ఆర్ధిక వ్యవస్థ 6.5 నుంచి ఏడు శాతం వరకూ ఎదుగుతుందని తాను అంచనా వేస్తున్నానని సుబ్రమణియన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక అప్పటి నుంచి వృద్ధి రేటు అంతకంతకూ పెరుగుతుందని అన్నారు. డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ వర్చువల్గా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాదిన్నరగా చేపట్టిన కీలక సంస్కరణలతో మరో దశాబ్ధం పాటు భారత్లో అధిక వృద్ధి నమోదవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక కరోనా నుంచి ఆర్ధిక వ్యవస్ధ రికవరీకి సెకండ్ వేవ్ కొంతమేర విఘాతం కలిగించిందని ఆయన అంగీకరించారు.