ఆన్లైన్ మార్కెట్ను వేదికగా చేసుకొని నకిలీ దందా పెద్ద ఎత్తున జరుగుతున్నదని పసిగట్టిన సీసీపీఏ.. అన్ని ఈ-కామర్స్ వెబ్సైట్లపైనా నిఘా పెట్టినట్లు చెప్పింది. వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నది. దెబ్బతిన్న వస్తువులను డిస్కౌంట్లలో అమ్మడంపైనా దృష్టి పెట్టామన్నది. కస్టమర్లు ఏ వస్తువును ఎక్కడ కొన్నా దానిపై ఐఎస్, బీఐఎస్ మార్క్లు ఉన్నాయా? లేదా? అన్నది తప్పక చూడాలని నిధి ఖరే కోరారు. లేకపోతే కొనవద్దన్నారు. ముఖ్యంగాహెల్మెట్లు, ప్రెషర్ కుక్కర్లు, వంటగ్యాస్ సిలిండర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఇవే ఎక్కువగా నకిలీవి ఉన్నాయని చెప్పారు. ఉదాహరణకు హెల్మెట్లపై ‘ఐఎస్ 4151:2015’ బీఐఎస్ మార్క్ను, కుక్కర్లపై ‘ఐఎస్ 2347:2017’ మార్క్ను పరిశీలించాలని సూచించారు.
న్యూఢిల్లీ, నవంబర్ 24: మార్కెట్లో నకిలీ వస్తువులపై కొరడా ఝుళిపించే దిశగా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) నడుం బిగించింది. ఇందులో భాగంగానే నాసిరకం ద్విచక్ర వాహన హెల్మెట్లు, వంటగ్యాస్ సిలిండర్లు, ప్రెషర్ కుక్కర్ల వంటి వస్తువుల కట్టడికి రంగంలోకి దిగినట్లు బుధవారం సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖరే పీటీఐకి తెలిపారు. నకిలీ ‘ఐఎస్ మార్క్’తో అమ్మకాలు సాగిస్తున్న వ్యాపారులు, సంస్థలపై నిఘా పెట్టామని, ఈ క్రమంలోనే అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎంమాల్ తదితర ఐదు ఈ-కామర్స్ సంస్థలతోపాటు సంప్రదాయ మార్కెట్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) నిబంధనలను పాటించని పలు వ్యాపారులకూ నోటీసులు ఇచ్చామని చెప్పారు. ‘ప్రజల భద్రత, ప్రయోజనాల పరిరక్షణలో భాగంగా ఆన్లైన్, ఆఫ్లైన్ మార్కెట్లలో నకిలీ వస్తువులను విక్రయిస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టాం. దీంతో దేశవ్యాప్తంగా నాసిరకం ప్రెషర్ కుక్కర్లు, టూవీలర్ హెల్మెట్లు, వంట గ్యాస్ సిలిండర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని గుర్తించాం’ అని నిధి ఖరే ఈ సందర్భంగా వెల్లడించారు.
భౌతిక మార్కెట్లో నకిలీ వస్తూత్పత్తుల విక్రయాల కట్టడి కోసం వినియోగదారుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఎటువంటి కేసులు నమోదైనా సమగ్ర విచారణ జరుపాలని దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీసీపీఏ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి రెండు నెలల్లో నివేదికనూ సమర్పించాలని స్పష్టం చేసింది.