Bank Fraud Case | ఎస్బీఐ సారధ్యంలోని బ్యాంకులకు శఠగోపం పెట్టిన ఏబీజీ షిప్యార్డ్ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రిషి కమలేశ్ అగర్వాల్ కోసం లుక్ఔట్ నోటీసు జారీ చేసినట్లు సీబీఐ మంగళవారం తెలిపింది. ఈ సంస్థ రూ.22,842 కోట్ల మేరకు ఫ్రాడ్ చేసింది. ఈ నేపథ్యంలో సంస్థ మాజీ సీఎండీ దేశం విడిచి విదేశాలకు పారిపోకుండా నిలువరించేందుకు లుక్ ఔట్ నోఈసులు జారీ చేశామని వెల్లడించింది. బ్యాంకుల కన్సార్టియంకు సారధ్యం వహించిన ఎస్బీఐ 2019లోనే లుక్ఔట్ నోటీసు జారీ చేసింది.
బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంథానం ముథాస్వామి, డైరెక్టర్లు అశ్వినికుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్, రవి విమల్ నివేథియా, మరో కంపెనీ ఏబీజీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ లపైనా కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్తోపాటు ఐపీసీలోని అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది సీబీఐ.
దర్యాప్తులో భాగంగా ఈ నెల 12న సీబీఐ 13 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో పలు కీలక ఆధారాలు గల పత్రాలను స్వాధీనం చేసుకుంది. 2019 నవంబర్ 8న ఎస్బీఐ తొలుత ఫిర్యాదు చేసింది. 2020 మార్చి 12న కొన్ని అంశాలపై సీబీఐ వివరణ అడిగింది. అదే ఏడాది ఆగస్టులో ఎస్బీఐ మరోమారు ఫిర్యాదు చేసింది. 18 నెలల తనిఖీల తర్వాత ఏబీజీ షిప్యార్డ్ కంపెనీపై ఈ నెల ఏడో తేదీన సీబీఐ కేసు నమోదు చేసింది.
ఎస్బీఐతోపాటు ఐసీఐసీఐ బ్యాంకుల సారధ్యంలోని 28 బ్యాంకులు, ఆర్థిక సంస్థల కన్సార్టియం వద్ద ఏబీజీ షిప్యార్డ్ రునాలు తీసుకున్నది. 2012-17 మధ్య సంస్థ యాజమాన్యం కుమ్మక్కై నిధులు దారి మళ్లించారని ఎర్న్స్ట్ అండ్ యంగ్ నిర్వహించిన అడిట్ రిపోర్ట్ పేర్కొంది. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆ రిపోర్టు పేర్కొంది.
ఇప్పటి వరకు సీబీఐ నమోదు చేసిన బ్యాంక్ ఫ్రాడ్ కేసుల్లో ఇదే అతి పెద్దది. ఇంతకుముందు పంజాబ్ నేషనల్ బ్యాంకును నీరవ్ మోదీ మోసగించి వేల కోట్లు స్వాహా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నీరవ్ మోదీ.. లండన్ జైలులో ఉన్నాడు. ఆయన మేనమామ మెహుల్ చౌక్సీ.. అంటిగ్వా అండ్ బార్బుడాలో ఉన్నాడు.