సీబీఐ లుక్అవుట్ నోటీసులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: భారీ బ్యాంక్ కుంభకోణానికి పాల్పడిన ఏబీజీ షిప్యార్డ్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రిషీ కమలేశ్ అగర్వాల్, మరో 8 మంది కోసం లుక్అవుట్ నోటీసులు జారీచేసినట్టు సీబీఐ తెలిపింది. పలు బ్యాంక్ల నుంచి రూ.22,842 కోట్ల రుణాన్ని తీసుకుని ఎగవేసిన కేసులో నిందితులు భారత్లోనే ఉన్నట్టు సీబీఐ మంగళవారం స్పష్టం చేసింది. వారు దేశం విడిచి వెళ్లకుండా తాము లుక్అవుట్ నోటీసులు జారీచేసినట్టు దర్యాప్తు సంస్థ పేర్కొంది. 2019లో బ్యాంక్లు చేసిన ఫిర్యాదు మేరకు విచారించిన సీబీఐ ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రిషీ అగర్వాల్తో పాటు అప్పటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతానం ముత్తస్వామి, డైరెక్టర్లు అశ్విని కుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్, రవి విమల్లను నిందితులుగా పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఏబీజీ షిప్యార్డ్కు రుణ సదుపాయాల్ని మంజూరు చేశాయి. రూ. 2,468 కోట్ల రుణాన్ని ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019 నవంబర్లో తొలుత ఫిర్యాదు చేసింది. 2012-17 మధ్యకాలంలో నిందితులు..నిధుల మళ్లింపు తదితర చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడినట్టు ఎర్నస్ట్ అండ్ యంగ్ ఫోరెన్సిక్ ఆడిట్లో తేలింది. బ్యాంక్లు ఏబీజీ ఖాతాను 2016లో ఎన్పీఏగా, 2019లో మోసపూరిత ఖాతాగా పరిగణించాయి.