హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు సీబీఐ గట్టి షాకిచ్చింది. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి లంచం ఇచ్చినట్లు రుజువుకావడంతో సీబీఐ శనివారం కేసు నమోదు చేసింది. ఎన్ఐఎస్పీ, ఎన్ఎండీసీకి చెందిన ఎనిమిది మంది ఉన్నతాధికారులతోపాటు మెకాన్కు చెందిన ఇద్దరు అధికారులపై ఎఫ్ఐఆర్ను దాఖలు చేసింది. జగ్దాల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్నకు సంబంధించి రూ.174 కోట్ల పెండింగ్ బిల్లుల కోసం మెఘా ఇంజినీరింగ్ అధికారులు రూ.78 లక్షల మేర లంచం ఇచ్చినట్లు తేలింది.
ఈ కేసును ఆగస్టు 10, 2023 నుంచి విచారణ చేపట్టిన సీబీఐ..శనివారం ఎనిమిది మంది అధికారులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. వీరిలో ఎన్ఐఎస్పీ, ఎన్ఎండీసీకి చెందిన పదవీ విరమణ చేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ దాశ్, డైరెక్టర్(ప్రొడక్షన్) డీకే మోహంతీ, డీజీఎం పీకే భూయాన్, డీఎం నరేశ్ బాబు, సీనియర్ మేనేజర్ సుబ్రో బెనర్జీ, రిటైర్డ్ సీజీఎం(ఫైనాన్స్) ఎల్ కృష్ణ మోహన్, జీఎం(ఫైనాన్స్) కే రాజశేఖర్, మేనేజర్(ఫైనాన్స్) సోమ్నాథ్ ఘోష్లు లంచం రూపంలో రూ.73.85 లక్షలు అందుకున్నారు. వీరితోపాటు మెకాన్ లిమిటెడ్ ఏజీఎం(కాంట్రాక్ట్స్) సంజీవ్ సహాయ్, డీజీఎం(కాంట్రాక్ట్స్) కే ఇల్లావార్స్లు కూడా రూ.5. లక్షల లంచం పొందారు. ఎన్ఎండీసీ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టునకు సంబంధించి రూ.315 కోట్ల ప్రాజెక్టు అమలులో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై గతేడాదిలోనే కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే.