Aadhaar- PAN Link | ఇప్పటి వరకు సుమారు 48 కోట్ల మంది పౌరులు తమ పాన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానం చేసుకున్నారు. మొత్తం 61 కోట్ల మంది పాన్ కార్డులు కలిగి ఉన్నారు. వచ్చే మార్చి 31వ తేదీ లోపు ఆధార్ కార్డుతో పాన్ నంబర్ను అనుసంధానించని వారు.. తర్వాతీ కాలంలో వివిధ వ్యాపారాలు, పన్ను అనుబంధ లావాదేవీల్లో లబ్ధి పొందలేరని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్పర్సన్ నితిన్ గుప్తా తేల్చి చెప్పారు.
ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత పాన్కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు (2023 మార్చి 31) లోగా ఆధార్తో అనుసంధానించని పాన్కార్డులు ఇన్ఆపరేటివ్గా నిర్ణయిస్తారు. ఇప్పటి నుంచి మార్చి 31 లోపు పాన్-ఆధార్ కార్డులను అనుసంధానించాలని కోరుకునే వారు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 61 కోట్ల మందిలో దాదాపు 48 కోట్ల మంది తమ పాన్కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేసుకున్నారు. ఇప్పటి వరకు మినహాయింపు క్యాటగిరీలో ఉన్నవారితో కలుపుకుని సుమారు 13 కోట్ల మంది ఇంకా పాన్-ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంది. నిర్దిష్ట గడువులోగా వారు కూడా లింక్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు నితిన్ గుప్తా.
పన్ను చెల్లింపుదారుల అభ్యర్థన మేరకు పలు దఫాలు ఆధార్-పాన్ కార్డుల అనుసంధాన ప్రక్రియ గడువు పొడిగించినట్లు సీబీడీటీ చైర్పర్సన్ నితిన్ గుప్తా తెలిపారు. పన్ను చెల్లింపు క్యాటగిరిలోకి వచ్చే వారు తప్పనిసరిగా వాటిని లింక్ చేసుకోవాల్సి ఉందని, మార్చిలోపు అనుసంధానించకుంటే పన్ను రాయితీలు కోల్పోతారన్నారు. పాన్-ఆధార్ లింకేజీపై ఇప్పటికే పలు దఫాలు సామాజిక క్యాంపెయిన్ చేశామని వివరించారు.
వ్యాపార రంగంలో ఉమ్మడి గుర్తింపు కార్డుగా పాన్ కార్డును బడ్జెట్లో ప్రకటించిన సంగతి సీబీడీటీ చీఫ్ నితిన్ గుప్తా గుర్తు చేశారు. ప్రభుత్వ సంస్థల డిజిటల్ సిస్టమ్స్పై అన్ని రకాల వ్యాపార లావాదేవీలకు పాన్ ఉమ్మడి గుర్తింపు కార్డుగా పరిగణిస్తారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల ఒకటో తేదీన బడ్జెట్ స్పీచ్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
మార్చి 30న పాన్ కార్డులను ఇన్ఆపరేటివ్ అని సీబీడీటీ సర్క్యులర్ జారీ చేసిన తర్వాత.. ఆదాయం పన్ను చట్టం కింద పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇన్ఆపరేటివ్ పాన్ కార్డుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేరు. పెండింగ్ రీఫండ్స్ కూడా జారీ కావు. పాన్ కార్డు ఇన్ ఆపరేటివ్ అయిన తర్వాత భారీగా పన్ను డిడక్ట్ చేస్తారు.
అసోం, మేఘాలయ రాష్ట్రాలతోపాటు జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల వాసులను ఆధార్ నంబర్తో పాన్ కార్డుల అనుసంధానం నుంచి మినహాయించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ 2017 మేలో నటిఫికేషన్ జారీ చేసింది. ఆదాయం పన్ను విభాగం విధానాన్ని సీబీడీటీ ఖరారు చేస్తుంది. విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆధ్వర్యంలో ఆధార్ కార్డులు జారీ అయితే, ఐటీ శాఖ ప్రతి వ్యక్తికి, సంస్థకు 10 అంకెల అల్ఫాన్యూమరిక్ నంబర్ను కేటాయిస్తుంది.