Cash Transactions | న్యూఢిల్లీ, మే 25: డిజిటల్ ఆర్థిక సేవలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. దేశవ్యాప్తంగా నగదుతో కొనుగోలు చేసేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నారు. ముఖ్యంగా ఐఫోన్లు, కార్లను నగదు రూపంలోనే అత్యధిక మంది కొనుగోలు చేస్తున్నారంట. యాపిల్కు దేశవ్యాప్తంగా ఉన్న రెండు స్టోర్లలో డిజిటల్కు బదులు నగదు ఇచ్చి తమకు నచ్చినదానిని కొనుగోలు చేస్తున్నారంట. గడిచిన నెలలో వీరి వాటా 7-9 శాతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సంస్థ ఈ రెండు స్టోర్లలో నగదు లెక్కించే యంత్రాలను ఏర్పాటు చేసింది అంటే..డిజిటల్ కంటే నగదు ద్వారానే కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారో తెలుస్తున్నది.
నగదు చలామణి రెండింతలు
దేశవ్యాప్తంగా నగదు చలామణి రెండింతలు పెరిగింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి నరేంద్ర మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు బెడిసికొడుతున్నాయి. నల్లధనాన్ని అరికట్టడానికి రోజుకు నగదు ద్వారా జరిపే లావాదేవీలను రూ.2 లక్షలకు నియంత్రించినప్పటికీ నగదు చలామణి మాత్రం ఆగడం లేదు. ఏకంగా రెండింతలు పెరిగి రూ.35.15 లక్షల కోట్లకు చేరుకున్నది. మార్చి 2017లో ఇది రూ.13.35 లక్షల కోట్లుగా ఉండగా, కేవలం ఏడేండ్లలోనే రెండు రెట్లు పెరగడం విశేషం. అలాగే ఇదే సమయంలో యూపీఐ చెల్లింపులు కూడా రూ.19.64 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏడేండ్లక్రితం ఇది రూ.2,425 కోట్లు మాత్రమేనని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా వెల్లడించింది.
15-20 శాతం..
ప్రస్తుతం ఎక్కువ మంది నగదు చెల్లింపులతోనే కార్లను కొనుగోలు చేసున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న కార్లలో 15-20 శాతం నగదు రూపంలోనే కొనుగోళ్లు జరిపారని ది ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) తెలిపింది. లగ్జరీ కార్లతోపాటు దేశీయంగా అమ్ముడవుతున్న ఐదింటిలో ఒక్కటి నగదు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని వెల్లడించింది. వీటిలో రూ.2 లక్షల వరకు నగదు ఇచ్చి, మిగతాది చెక్ రూపంలో, బ్యాంక్ డ్రాఫ్ట్ లేదా బ్యాంక్ ఖాతా నుంచి, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు లేదా ఎలక్ట్రానిక్ పద్దతిలో నిధులను పంపిస్తున్నారు.