న్యూఢిల్లీ, జూన్ 1 : కార్ల అమ్మకాలు గత నెలలో జోరుగా సాగాయి. మేలో మారుతీ సుజుకీ, కియా ఇండియాలైతే రికార్డు సేల్స్ను నమోదు చేశాయి. దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ సంస్థ విక్రయాలు మునుపెన్నడూ లేనివిధంగా 1,93,535 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు మేలో 1,38,690 యూనిట్లేనని సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో తేలింది. మార్కెట్లో ఇంధన ధరలు పెరిగినా డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషమేనని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మార్కెటింగ్ అండ్ సేల్స్ పార్థో బెనర్జీ పీటీఐతో అంటున్నారు.
‘నిజానికి చిన్న కార్ల విక్రయాలను పెరిగిన పెట్రో ధరలు ప్రభావితం చేయగలవు. కానీ మా కార్ల సేల్స్ ఆకర్షణీయమైన వృద్ధిని కనబర్చాయి. మినీ, కంపాక్ట్ సెగ్మెంట్ ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో 42 శాతం పెరుగుదల ఉన్నది. ఆల్టో, ఎస్-ప్రెస్సో సేల్స్ గత ఏడాదితో పోల్చితే 6,776 యూనిట్ల నుంచి 16,275 యూనిట్లకు పెరిగాయి. బలెనో, సెలీరియో, డిజైర్, ఇగ్నీస్, స్విఫ్ట్, వాగనార్ అమ్మకాలు కూడా 61,960 యూనిట్ల నుంచి 81,555 యూనిట్లకు చేరాయి’ అన్నారు. ఇక కియా సేల్స్ 23.6 శాతం వృద్ధిని కనబర్చాయి. తొలిసారి ఒక నెలలో 27,586 యూనిట్లను అమ్మినట్టు సంస్థ తెలిపింది.
