హైదరాబాద్, ఆగస్టు 30: జర్మనీకి చెందిన ప్రీమియం కార్ల విక్రయ సంస్థ ఫోక్స్వ్యాగన్..తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్లలో ఒకేరోజు ఐదు నూతన షోరూంలను ప్రారంభించింది. వీటిలో హైదరాబాద్లో బంజారాహిల్స్, సికింద్రాబాద్, కూకట్పల్లి షోరూంలను ఆరంభించిన సంస్థ..ఏపీలో కర్నూల్, అనంతపురంలో టచ్పాయింట్లను ఏర్పాటు చేసింది. కస్టమర్లకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఒకేరోజు ఐదు షోరూంలను ప్రారంభించినట్టు కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. దీంతో తెలుగు రాష్ర్టాల్లో కంపెనీ షోరూంల సంఖ్య 24కి చేరుకున్నది. అలాగే దేశవ్యాప్తంగా 184 విక్రయ కేంద్రాలు ఉండగా, 131 సర్వీస్ ఔట్లెట్లు ఉన్నాయి. ప్రస్తుతం సంస్థలో 250కి పైగా ప్రతిభ కలిగిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణ అంచనాలకుమించి రాణిస్తున్నదని, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ రంగం మరింత బలోపేతం కావడంతో వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోయే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.