ముంబై, జూలై 24: క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)కల్లా స్టాక్ ఎక్సేంజీల్లో ఇన్స్టంట్ ట్రాన్జాక్షన్ సెటిల్మెంట్ను పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. లావాదేవీ తర్వాత కేవలం ఒక్క రోజులోనే సెటిల్మెంట్ అయ్యేలా చూస్తున్నట్టు సెబీ చైర్పర్సన్ మదాబి పురి బచ్ సోమవారం తెలిపారు. ‘స్టాక్ మార్కెట్ లావాదేవీల ఇన్స్టంట్ సెటిల్మెంట్కు ఇక ఎన్నో రోజులు పట్టదు’ అన్నారు. న్యూ ఈక్విటీ-డెట్ ఇష్యూఎన్సెస్, టెక్నాలజీ వినియోగం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ కోసం అనుమతుల వంటి వాటిపై భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్టు పురి వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో క్యాపిటల్ ఫార్మేషన్ బలోపేతానికి జరిగే ఈ కార్యాచరణతో ఏటా రూ.3,500 కోట్ల ప్రయోజనం మదుపరులకు చేకూరుతుందన్నారు.
దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో పూర్తిగా కొత్త వ్యవస్థీకృత నిర్మాణాన్ని, నూతన నిబంధనలను తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు పురి తెలిపారు. డీ-లిస్టింగ్ ప్రక్రియను సమీక్షిస్తామన్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్కల్లా కన్సల్టేషన్ పేపర్తో వస్తామని హామీ ఇచ్చారు. కాగా, వ్యాపార, పారిశ్రామిక సంఘాలైన సీఐఐ, ఫిక్కీ, ఐసీఏఐ, ఐసీఎస్ఐలతోపాటు నిఫ్టీలో నమోదైన 50 కంపెనీల సీఈవోలకు ప్రతిపాదిత మార్పులపై సెబీ లేఖలు రాసింది. వీరందరి అభిప్రాయాల ఆధారంగా సదరు మార్పులు, నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
మూతబడిన నేషనల్ స్పాట్ ఎక్సేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్) అక్రమాల్లో ప్రమేయమున్న రెండు బ్రోకరేజీ సంస్థలపై సెబీ సస్పెన్షన్ వేటు వేసింది. నోర్టెల్ విన్కమ్, నార్త్ఈస్ట్ కమోడిటీస్ రిజిస్ట్రేషన్లను సోమవారం తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ బ్రోకరేజీల వల్ల అమాయాక మదుపరులు రిస్కులో పడ్డారని ఈ సందర్భంగా సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ఎస్ఈఎల్ కుంభకోణంతో మదుపరులు వేలాది కోట్ల రూపాయల్లో నష్టపోయినది తెలిసిందే.