CapGemini |కరోనా తర్వాత ఐటీ రంగంలో డిజిటల్ సొల్యూషన్స్కు ప్రాధాన్యం.. గిరాకీ పెరిగింది. ఫ్రాన్స్ ఐటీ దిగ్గజం కాప్జెమిని ఈ ఏడాది భారత్లో దాదాపు 60 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నది. ఇది గతేడాదితో పోలిస్తే చాలా ఎక్కువే. డిజిటల్ ఆధారిత సొల్యూషన్స్కు డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నదని కాప్జెమినీ సీఈవో అశ్విన్ యాద్రి చెప్పారు. డిజిటల్ ఆధారిత సొల్యూషన్స్పై పట్టు ఉన్న నిపుణులు ఇప్పుడు చాలా అవసరం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3.25 లక్షల మంది ఉద్యోగులు కాప్జెమినీలో సేవలందిస్తుంటే, అందులో సగం భారత్లోనే ఉన్నారు. ఫ్రెషర్స్ అటుపై ప్రతిభావంతులను నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తామని సంస్థ చెబుతున్నది.
రానున్నది 5జీ తరం. కనుక ఆ దిశగా ఐటీ, టెక్నాలజీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ టెక్ సంస్థ ఎరిక్సన్తో కాప్జెమినీ జత కట్టింది. గతేడాది ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో భారత్లో 5జీ ల్యాబ్ను ప్రారంభించారు. భారత్తోపాటు కొన్ని దేశాల్లోని క్లయింట్లకు 5జీ రంగ సేవలు అందించేందుకు సిద్ధం అవుతున్నది. క్వాంటం, 5జీ, మెటావర్స్ టెక్నాలజీల్లో సేవలందించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
ఇదిలా ఉంటే, ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 21,503 మందిని నియమించుకున్నది. గతేడాదితో పోలిస్తే నియామకాలు 90 శాతం పెరిగాయి. ఈ నెలాఖరు నాటికి నియామకాల సంఖ్య 26 వేలకు చేరుతుందని భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 12,931 మందిని కొత్తగా నియమించుకున్నది.