బెంగళూరు, జనవరి 1: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ సోమవారం బెంగళూరులో తమ నూతన డాటా అండ్ అనలిటిక్స్ సెంటర్ను ప్రారంభించింది. సంస్థ ఎండీ, సీఈవో కే సత్యనారాయణ రాజు దీన్ని ఆవిష్కరించారు. ఇన్నోవేషన్, కొలాబరేషన్కు మద్దతిచ్చేలా స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ సదుపాయాలతో నిండిన ఈ సెంటర్ను ఎక్స్లెన్స్ హబ్గా మార్చాలని బ్యాంక్ చూస్తున్నది.
ఈ సందర్భంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) రాకతో మానవుల జీవితాలు ఊహించని విధంగా మారిపోయాయన్న సీఈవో.. ఏఐ నైతిక వినియోగం కోసం యావత్తు ప్రపంచం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. అలాగే క్లౌడ్ టెక్నాలజీలో డాటా లేక్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ వేదికల ఏర్పాటు కోసం భాగస్వామ్యాలకూ సిద్ధమన్నారు.
డెకాయ్థాన్ ఫినాలే
కొత్త సంవత్సరం ఆరంభం సందర్భంగా సోమవారం డెకాయ్థాన్ (డాటా అనలిటిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ హ్యాకథాన్) గ్రాండ్ ఫినాలేనూ బ్యాంక్ నిర్వహించింది. బ్యాంకింగ్ సేవలపై ఖాతాదారుల అనుభవం, మోసాల నిరోధం, దివాలా అంచనా వంటి అంశాలపై దేశవ్యాప్తంగా ఔత్సాహికులు ఇందులో పాల్గొని తమ ఆలోచనల్ని పంచుకున్నారు. విజేతలకు ఆకర్షణీయ నగదు ప్రోత్సాహకాలను బ్యాంక్ అందించింది.
గత ఏడాది అక్టోబర్ 20 నుంచి నవంబర్ 5 వరకు జరిగిన డెకాయ్థాన్లో 2,899 మంది పాల్గొన్నారు. వీరిలో కొత్త ఆలోచనల్ని చూపిన 256 మంది తదుపరి దశకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 13 నుంచి 30 వరకు, డిసెంబర్ 5 నుంచి 11 వరకు తర్వాతి స్థాయి పోటీలు జరిగాయి. సోమవారం జరిగిన ఫైనల్లో ఐదుగురు పాల్గొని వారి ఆలోచనల్ని ఆవిష్కరించినట్టు బ్యాంక్ తెలియజేసింది.