న్యూఢిల్లీ, నవంబర్ 21: వచ్చే మూడు వారాల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పెండ్లిళ్లు జరుగనుండటంతో వ్యాపార అంచనాలూ అంతే స్థాయిలో వినిపిస్తున్నాయి. ఈసారి దాదాపు 38 లక్షల వివాహాలు జరుగనున్నాయని చెప్తున్నారు. దీంతో ఈ వెడ్డింగ్ సీజన్ వ్యాపారం రూ.4.74 లక్షల కోట్లను తాకవచ్చని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) మంగళవారం అంచనా వేసింది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 15 వరకు పెండ్లిళ్లు జోరుగా సాగనున్నాయి.
లక్ష కోట్లు అదనంగా..
గత ఏడాది ఇదే పెండ్లిళ్ల సీజన్లో జరిగిన వ్యాపారం రూ.3.75 లక్షల కోట్లుగా ఉన్నది. నిరుడు సుమారు 32 లక్షల వివాహాలు జరిగాయి. ఈ క్రమంలో ఈ ఏడాది గతంతో పోల్చితే 6 లక్షల వివాహాలు అధికంగా జరుగనుండటంతో మరో లక్ష కోట్ల రూపాయల వ్యాపారమైనా ఎక్కువగానే జరుగుతుందని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 30 నగరాల్లోని తమ వర్తక సంఘాల నుంచి వచ్చిన అంచనాల ఆధారంగా ఈ తాజా అంచనాను సీఏఐటీ ప్రకటించింది.
బంగారం నుంచి..
సంప్రదాయ వ్యవస్థతో కూడిన మన దేశంలో పెండ్లి అనేది కేవలం ఓ తంతు మాత్రమే కాదు.. అంతకుమించే. ఆయా కుటుంబాల స్థోమతనుబట్టి వీలైనంత వరకు ఘనంగానే ఈ వేడుకను జరిపిస్తారంతా. అందుకే భారత్లో వెడ్డింగ్ సీజన్.. మార్కెట్కు కొత్త ఉత్సాహాన్ని తెప్పిస్తుంది. పెండ్లి అనగానే రకరకాల పెట్టుపోతలుంటాయి మరి. నగల దగ్గర్నుంచి బట్టలదాకా భారీగానే కొనాల్సి ఉంటుంది. ఇతరత్రా గృహోపకరణాల కొనుగోళ్లూ తప్పనిసరే. దీంతో ఆయా వస్తూత్పత్తుల విక్రయాలు జోరందుకుంటాయి.
ముఖ్యంగా బంగారు ఆభరణాలు, వెండి సామాగ్రీ అమ్మకాల్లో వెడ్డింగ్ సీజన్ వాటా ఎక్కువే. ఏటా జరిగే విక్రయాలను చూస్తేనే అర్థమవుతుంది. అలాగే టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సర్-గ్రైండర్లు, వంట సామాగ్రీ అమ్మకాలు ఆకర్షణీయంగానే జరుగుతాయి. వాహన అమ్మకాలూ పెరుగుతాయి. ఇక వధువరుల వస్ర్తాలకు పెట్టే ఖర్చు ప్రత్యేకం. పాదరక్షలు, వ్యక్తిగత సౌందర్యాలంకరణ, గృహాలంకరణ ప్రోడక్ట్స్కూ డిమాండ్ ఉంటుంది.
పావు శాతం ఢిల్లీలోనే..
ఈసారి ఢిల్లీలో 4 లక్షలకుపైగా పెండ్లిళ్లుంటాయని అంచనా. ఫలితంగా దేశవ్యాప్తంగా జరిగే వ్యాపారంలో దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఇక్కడి నుంచే నమోదయ్యే వీలుందని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ఖండేల్వాల్ అంటున్నారు. నవంబర్ 23, 24, 27, 28, 29, డిసెంబర్ 3, 4, 7, 8, 9, 15 తేదీల్లో వివాహాలు జోరుగా ఉంటాయని సీఏఐటీ పేర్కొంటున్నది.