న్యూఢిల్లీ, మే 15: బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ.. అమెరికా కోర్టులో దావా వేసింది. పన్ను వివాదం కేసులో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా భారత్ నుంచి 1.72 బిలియన్ డాలర్ల (రూ.12,604 కోట్లు) వసూలు కోసమే కెయిర్న్ కోర్టుకెక్కింది. కేంద్ర ప్రభుత్వ ఆస్తుల జప్తుతో రికవరీకి దిగాలనుకుంటున్న కెయిర్న్.. అందులో భాగంగానే విమానాలు తదితర ఎయిర్ ఇండియా విదేశీ ఆస్తుల స్వాధీనానికి ప్రయత్నాలు చేస్తున్నది.
ఈ క్రమంలోనే ఈ నెల 14న న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్లోని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టులో దావాను దాఖలు చేసింది. ఇందులో భారత ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఎయిర్ ఇండియాను ప్రకటించాలని కెయిర్న్ కోరుతున్నట్లు తెలుస్తున్నది. ఇదే జరిగితే ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం తమకు రావాల్సిన సొమ్ము వసూలు కోసం విదేశాల్లోని ఎయిర్ ఇండియాకు చెందిన ఆస్తులను అమ్ముకునే అధికారం కెయిర్న్కు వచ్చేస్తుంది. 1994లో భారతీయ చమురు, గ్యాస్ రంగంలో కెయిర్న్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టింది.
దశాబ్దకాలం తర్వాత రాజస్థాన్లో భారీ చమురు క్షేత్రాన్ని కెయిర్న్ కనుగొన్నది. 2006లో బీఎస్ఈలో తమ భారతీయ ఆస్తులను కెయిర్న్ లిస్టింగ్ చేసింది. అయితే ఐదేండ్ల తర్వాత కెయిర్న్పై భారత్ రెట్రోయాక్టివ్ ట్యాక్స్ చట్టాన్ని అమలు చేసింది. రీఆర్గనైజేషన్కు సంబంధించి రూ.10,247 కోట్లు, దానిపై వడ్డీ, జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే కెయిర్న్ ఇండియా డివిడెండ్లను, పన్ను రిఫండ్లను జప్తు చేసింది. దీనిపై హేగ్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో కెయిర్న్ ఫిర్యాదు చేసింది. ఫలితంగా కెయిర్న్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై భారత్ సైతం న్యాయపోరాటం చేస్తుండగా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పన్నులపై భారత సార్వభౌమాధికార హక్కును ఆర్బిట్రేషన్ తప్పుగా చూసిందని వ్యాఖ్యానించారు.