Uttar Pradesh : చాక్లెట్లు దొంగతనం చేసిందనే నెపంతో ఏకంగా చిన్నారి కూతురునే కొట్టిచంపాడు ఓ కర్కశ తండ్రి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని, బులంద్షహర్ ప్రాంతంలోని రతన్పూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఒక షాపులో పన్నెండేళ్ల చిన్నారి పూజ డబ్బులు చెల్లించకుండా చాక్లెట్లు తీసుకెళ్లింది. దీన్ని దొంగతనంగా భావించిన షాపు యజమాని పూజ తండ్రికి ఈ విషయం చెప్పాడు.
అప్పటికే మద్యం తాగి ఉన్న పూజ తండ్రి పుష్పేంద్ర ఈ విషయం తెలియగానే ఆగ్రహావేశాలకు లోనయ్యాడు. కూతురు దొంగతనం చేసిందనే ఆవేశంతో ఇంటికి వెళ్లి పూజపై దాడి చేశాడు. కర్రతో బాలికపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కూతురని కూడా చూడకుండా తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో పూజ తీవ్రంగా గాయపడింది. రక్తస్రావం జరిగింది. అయినప్పటికీ గాయాలపాలైన పూజను ఒక గదిలో బంధించాడు. అంతేకాదు.. భార్యను కూడా బంధించాడు. ఆ తర్వాత తాళం వేసి పుష్పేంద్ర అక్కడ్నుంచి పారిపోయాడు. కొంతసేపటి తర్వాత తల్లి అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు వచ్చి వారిద్దరినీ విడిపించారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే పూజ మరణించిందని వైద్యులు తెలిపారు.
మృతదేహాన్ని మార్చురికి తరలించిన అనంతరం బాలికకు పోస్టుమార్టం నిర్వహించారు. బాలిక పుర్రెకు గాయమైందని, అలాగే ఒంటిపై చాలా గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. 10-12 వరకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన బాలిక తండ్రి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.