Byju’s | ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రముఖ ఎడ్-టెక్ స్టార్టప్ సంస్థ ‘బైజూ’స్.. క్రమంగా గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నది. టర్మ్ లోన్ -బీ కింద తీసుకున్న 120 కోట్ల డాలర్ల రుణం చెల్లించడానికి తన ఆస్తుల విక్రయానికి పూనుకున్నది. ఎపిక్, గ్రేట్ టెర్నింగ్ అనే విభాగాలను విక్రయించనున్నట్లు తెలుస్తున్నది. వీటి విక్రయంతో 800 మిలియన్ డాలర్ల నుంచి 100 కోట్ల డాలర్ల మేర నిధులు సేకరించాలని బైజూస్ రవీంద్రన్ భావిస్తున్నట్లు సమాచారం.
బ్యాంకర్ల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తన కీలక విభాగాలను వ్యూహాత్మక భాగస్వాములకు విక్రయించాలని బైజూస్ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. మరోవైపు నిధుల సేకరణకు ఈక్విటీ క్యాపిటల్ పెంచుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఎపిక్ విక్రయంతో 400-500 మిలియన్ డాలర్ల నిధులు సేకరించొచ్చునని భావిస్తున్నట్లు సమాచారం.
హయ్యర్ ఎడ్యుకేషన్, అప్ స్కిల్లింగ్ ఫర్మ్ గ్రేట్ లెర్నింగ్ అమ్మకంతో 500-600 మిలియన్ డాలర్ల నిధులు వస్తాయని అంచనా వేస్తున్నారు రవీంద్రన్. ఆరు నెలల్లోపు టర్మ్ లోన్ బీ రుణం 1.2 బిలియన్ డాలర్లు పూర్తిగా చెల్లించేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై స్పందించేందుకు బైజూస్ అధికార ప్రతినిధి నిరాకరించారు.