Byjus | ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ కంపెనీ ‘బైజూ’స్ కంపెనీకి మరో కష్టమొచ్చింది. సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించలేక పోతున్నానని బైజూ’స్ సీఈఓ బైజూ రవీంద్రన్ తెలిపారు. ఇన్వెస్టర్లు తమ ప్రయోజనాల కోసం నిధులను ఒక ప్రత్యేక ఖాతాలో లాక్ చేశారని ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 10 నాటికి వేతనాల చెల్లింపునకు ప్రయత్నిస్తామన్నారు.
‘దురద్రుష్టవశాత్తు కొందరు ఇన్వెస్టర్ల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నది. రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించుకున్నా.. ఇన్వెస్టర్ల చర్య వల్ల మీరు పడ్డ కష్టానికి వేతనం చెల్లించలేని పరిస్థితి నెలకొంది. బైజూ’స్లో పెట్టుబడుల ద్వారా గణనీయ లాభాలు పొందారు. అందులో ఒకరు తమ పెట్టుబడిపై ఎనిమిది రెట్లు లాభాలు గడించారు. అటువంటి వారు ఇతరుల జీవితాలు, జీవనోపాధితో ఆటలాడుతున్నారు’ అని బైజూ రవీంద్రన్ ఆరోపించారు.
రైట్స్ ఇష్యూ జారీ ద్వారా సేకరించిన నిధులను ‘ఒక ఎస్క్రో’ ఖాతాలో జమ చేయాలని బైజూ’స్ యాజమాన్యాన్ని గత నెల 27న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చేనెల నాలుగో తేదీకి వాయిదా వేసింది. కంపెనీ యాజమాన్యం అణచివేత, దుర్వినియోగాన్ని నివారించాలని కోరుతూ నలుగురు ఇన్వెస్టర్లు దాఖలు చేసిన పిటిషన్ను ఎన్సీఎల్టీ విచారణకు స్వీకరించింది. గత నెలలో బైజూ’స్ పేరెంట్ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్.. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.1660 కోట్ల (200 మిలియన్ డాలర్లు) నిధులు సేకరించింది. సంస్థ నిర్వహణలో ఇబ్బందులను పరిష్కరించడానికి ఈ నిధులు ఉపకరిస్తాయని కంపెనీ యాజమాన్యం అంచనా వేసింది.