న్యూఢిల్లీ, మే 26: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) డిజిన్వెస్మెంట్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా బీపీసీఎల్ ప్రైవేటీకరణ పక్రియలో పాల్గొనేందుకు మెజారిటీ బిడ్డర్లు అనాసక్తి చూపించడమే ఇందుకు కారణమని ప్రభుత్వం తెలిపింది. బీపీసీఎల్లో కేంద్రానికి ఉన్న మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించేందుకు గతంలో బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలకు (ఈవోఐలు) ప్రభుత్వం ఆహ్వానించింది. 2020 నవంబర్కల్లా మూడు బిడ్స్ అందాయి. ఇంధన ధరల విధానంపై స్పష్టత లోపించడంతో పాటు ఇతర అంశాల కారణంగా ఇద్దరు బిడ్డర్లు మధ్యలోనే వైదొలిగారు. ఒక బిడ్డరు మాత్రమే రంగంలో మిగిలారు.
కొవిడ్ వేవ్స్, భౌగోళిక రాజకీయ పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలన్నీ ప్రభావితమయ్యాయని, ముఖ్యంగా చమురు, సహజవాయువుల పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడిందని, దీంతో మెజారిటీ క్యూఐపీలు..బీపీసీఎల్ ప్రస్తుత డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియను కొనసాగించేందుకు నిస్సహాయత వ్యక్తం చేసినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) గురువారం వివరించింది.
ఈ నేపథ్యంలో బీపీసీఎల్ వ్యూహాత్మక విక్రయానికి ఇప్పుడు అమలు జరుగుతున్న ఈవోఐ ప్రక్రియను నిలిపివేయాలని డిజిన్వెస్ట్మెంట్ మంత్రుల గ్రూప్ నిర్ణయించిందని, దీంతో క్యూఐపీల నుంచి అందుకున్న ఈవోఐలు రద్దవుతాయని దీపం ప్రకటించింది. పరిస్థితిని సమీక్షించిన మీదట బీపీసీఎల్ వ్యూహాత్మక విక్రయ ప్రక్రియ పునర్ప్రారంభంపై తదుపరి రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపింది.