న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: దేశీయ నిర్మాణ రంగం జోష్ మీదున్నదని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఈ క్రమంలోనే 2025నాటికి చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద నిర్మాణ రంగ మార్కెట్గా భారత్ అవతరించగలదన్న ఆశాభావాన్ని గురువారం వ్యక్తం చేశారు. దేశ జీడీపీలో నిర్మాణ రంగం వాటా 9 శాతంగా ఉన్నదన్న ఆయన.. దేశంలో ఉపాధినిస్తున్న రంగాల్లో రెండో స్థానంలో ఉందని, సుమారు 7.1 కోట్ల మంది నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. తద్వారా దేశ ఆర్థికాభివృద్ధిలో నిర్మాణ రంగం ప్రధాన పిల్లర్గా నిలుస్తున్నదన్నారు.
ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2047నాటికి భారత జనాభా 164 కోట్లకు చేరనున్నది. వీరిలో నగరాలు, పట్టణాల్లోనే దాదాపు 51 శాతం మంది నివసిస్తారని అంచనా. అందువల్ల తమ ప్రభుత్వం సైతం పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. నిజానికి దేశీయ నిర్మాణ రంగం.. రియల్ ఎస్టేట్, పట్టణాభివృద్ధి అనే రెండు కీలక భాగాలుగా ఉంటుందన్నారు. రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో రెసిడెన్షియల్, ఆఫీస్, రిటైల్, హోటల్, లీజర్ పార్క్ ప్రాజెక్టుల వంటివి ఉంటాయన్నారు. అర్బన్ డెవలప్మెంట్ విభాగంలో నీటి సరఫరా, పారిశుద్ధ్యం, రవాణా, పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ ఉంటాయని చెప్పారు. దీంతో ఆయా విభాగాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆకర్షించడంలోనూ దేశీయ నిర్మాణ రంగం ముందున్నట్టు మంత్రి పేర్కొన్నారు. 6వ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. గడిచిన 23 ఏండ్లలో రూ.2.6 లక్షల కోట్లకుపైగా ఎఫ్డీఐని అందుకున్నది. టౌన్షిప్, మాల్స్, వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం పూర్తయిన ప్రాజెక్టుల్లోకి ఆటోమేటిక్ మార్గం గుండా 100 శాతం ఎఫ్డీఐకి అనుమతి ఉన్నట్టు వివరించారు. రవాణా, నీటి సరఫరా, మురుగునీరు-దాని నిర్వహణకు సంబంధించీ ఇదే తరహాలో ఎఫ్డీఐకి అనుమతి ఉన్నట్టు గుర్తుచేశారు.
2030నాటికి దేశీయ రియల్ ఎస్టేట్ రంగం విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా. అయితే 2047 నాటికి ఇది 5.8 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని కూడా అంచనాలున్నట్టు మంత్రి అంటున్నారు. నిర్మాణ రంగం వేగంగా పురోగమిస్తుండటంతో సిమెంట్, స్టీల్ తయారీ కూడా బాగా జరుగుతున్నట్టు తెలిపారు. నిర్మాణ రంగానికి 250కిపైగా అనుబంధ రంగాలున్నాయని, వీటన్నిటిలో దేశంలోని 18 శాతం కార్మిక శక్తి పనిచేస్తున్నదని చెప్పారు.