Stock Market | ముంబై, మార్చి 13: హఠాత్ అమ్మకాలతో బుధవారం స్టాక్ మార్కెట్ అతలాకుతలమయ్యింది. కొద్దిరోజులుగా దుందుడుకు ర్యాలీ చేస్తున్న పలు పీఎస్యూ, రైల్వే, అదానీ గ్రూప్ షేర్లలో ఒక వైపు నగదు మార్కెట్లోనూ, ఫ్యూచర్ కాంట్రాక్టుల్లోనూ ఒక్కసారిగా బుల్స్ భారీ ఆఫ్లోడింగ్కు పాల్పడటంతో మార్కెట్లోని మిగతా రంగాల షేర్లకు అమ్మకాలు విస్తరించాయి. దీంతో రోజుల తరబడి ఆర్జించిన రూ.14 లక్షల కోట్ల సంపద ఒక్కరోజులో ఆవిరైపోయింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.372 లక్షల కోట్లకు పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 900 పాయింట్లు పతనమై 72,762 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 1100 పాయింట్లు పతనమయ్యింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 330 పాయింట్లు నష్టపోయి 21,998 పాయింట్ల వద్ద నిలిచింది. సెన్సెక్స్ షేర్లలో అన్నింటికంటే అధికంగా పవర్గ్రిడ్ 7 శాతంపైగా పతనమయ్యింది. ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.9 శాతం క్షీణించగా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, భారతి ఎయిర్టెల్, టైటాన్లు 3-6 శాతం మధ్య తగ్గాయి. తాజా పతనానికి పలు కారణలున్నాయి. అవి..
మార్కెట్లో కొన్ని విభాగాల్లో మురికి పేరుకుపోతున్నదని, ఫండమెంటల్స్తో సంబంధం లేకుండా కృత్రిమంగా పెరిగిపోతున్నాయన్న ఆందోళనల్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్పర్సన్ మాధబి పురి బుచ్ తాజాగా వ్యక్తం చేశారు. ఇలా కొన్ని పాకెట్స్లో గాలిబుడగలు ఏర్పడుతున్నాయని, దీనిని అనుమతించబోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ ఫండ్స్లో తాజా పెట్టుబడుల్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. మార్కెట్ విలువలు అధికంగా ఉన్నాయనడానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు చెప్పారు.
చట్ట విరుద్ధంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మహదేవ్ బెట్టింగ్ యాప్పై ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన దర్యాప్తులో దీనికి స్టాక్ మార్కెట్ బబుల్తో సంబంధం ఉన్నదని తేలింది. హవాలా ఆపరేటర్ హరిశంకర్ తిబ్రేవాలాకు చెందిన డీమ్యాట్ అకౌంట్లలో ఉన్న రూ.1,100 కోట్ల విలువైన 30 లిస్టెడ్ షేర్లను ఈడీ ఫ్రీజ్ చేసింది. ఈ చర్యతో ఆ షేర్లన్నీ భారీ పతనాన్ని చూస్తున్నాయి.
సెబీ వార్నింగ్ నేపథ్యంలో రుణాలు, బ్రోకర్ల మార్జిన్ ఫండింగ్ ద్వారా కొన్న స్మాల్, మిడ్క్యాప్ షేర్లను, డెరివేటివ్ పొజిషన్లను ఆఫ్లోడ్ చేయాలంటూ ట్రేడర్లను స్టాక్ బ్రోకర్లు ఒత్తిడి చేయడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్నందున పొజిషన్లను స్కేర్ఆఫ్ చేసుకోవాలంటూ బ్రోకర్లు సూచిస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరి కొద్ది రోజుల్లో ముగియనుండటంతో ఇన్వెస్టర్లు పన్ను ప్రయోజనాల రీత్యా కొన్నింటిలో లాభాలను, మరికొన్నింటిలో నష్టాలను బుక్చేస్తూ వారి పోర్ట్ఫోలియోల్లో మార్పులు చేసుకుంటున్నందున మార్కెట్ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. సాధారణంగా ఈ ప్రక్రియను ఇన్వెస్టర్లు మార్చి నెలలో చేపడుతుంటారు.
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) రూ.4,595 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడించాయి. వాస్తవానికి విదేశీ ఇన్వెస్టర్లు ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత స్థూలంగా రూ.33,223 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఐటీసీలో ప్రమోటర్ బ్యాట్ విక్రయించిన రూ.17,500 కోట్ల విలువైన 3.5 శాతం వాటాలో ఎక్కువశాతం విదేశీ ఫండ్స్ కొన్నందున, ఈ విభాగంలో స్థూల అమ్మకాలు ఎక్కువ నమోదయ్యాయి. కానీ ఇదే సమయంలో ఐటీసీ షేర్లను కొని, ఇతర రంగాల షేర్లను పెద్దమొత్తంలో విక్రయించారనడానికి నిదర్శనంగా రూ. 37,818 కోట్ల స్థూల అమ్మకాలు జరిపినట్టు ఎక్సేంజీల డేటా వెల్లడిస్తున్నది. దీంతో నికరంగా రూ.4, 595 కోట్లు వెనక్కు తీసుకున్నట్టయ్యింది.
రిటైల్ ఇన్వెస్టర్లు ఇబ్బడిముబ్బడిగా కొంటున్న చిన్న షేర్లు నిలువునా పతనమయ్యాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 5 శాతం పడిపోగా, మిడ్క్యాప్ సూచి 4 శాతం క్షీణించింది. మైక్రోక్యాప్, ఎస్ఎంఈ స్టాక్ ఇండెక్స్లు 6 శాతం చొప్పున తగ్గాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఫండ్మెంటల్స్ బలంగా లేని షేర్లలో భారీ లాభాలకు ఆశపడి పెట్టుబడి చేయడం ఆందోళనకరంగా మారిందని, దీంతో ఆ బుడగ పేలిపోయిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వీకే విజయ్కుమార్ వ్యాఖ్యానించారు. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు 5 శాతం చొప్పున పతనంకాగా, పీఎస్యూ బ్యాంక్ సూచి 4 శాతం, ఆటో ఇండెక్స్ 3 శాతం చొప్పున క్షీణించాయి. ఫార్మా సూచి సైతం 2 శాతం తగ్గింది. ఐటీసీ షేర్లు 5 శాతం ర్యాలీ చేసిన ప్రభావంతో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ మాత్రం ఫ్లాట్గా ముగియగలిగింది.
స్టాక్ మార్కెట్లలో లిైస్టెన అదానీ గ్రూప్ సంస్థల షేర్లన్నీ బుధవారం భారీ నష్టాలకు లోనయ్యాయి. దీంతో ఈ ఒక్కరోజే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.1,12,780.96 కోట్లు హరించుకుపోయింది. కాగా, దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్నకు చెందిన మొత్తం 10 సంస్థల షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. వీటిలో అదానీ టోటల్ గ్యాస్ షేర్లు గరిష్ఠంగా 9.50 శాతం నష్టాలను చవిచూశాయి. అదానీ విల్మర్ షేర్లు కనిష్ఠంగా 4.25 శాతం పడిపోయాయి. ఇక గ్రూప్ ప్రతిష్ఠాత్మక సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు.. గత వారం రోజులుగా క్షీణిస్తూనే ఉండటం గమనార్హం. మరోవైపు తాజాగా అదానీ పవర్ షేర్ విలువ లోయర్ సర్క్యూట్ లిమిట్ను తాకింది.