Bull run-Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో ‘బుల్’ పరుగులు తీస్తున్నది. గత ఐదు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.12.80 లక్షల కోట్లు పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి తాజా పెట్టుబడుల వరద, దేశీయంగా సానుకూల సూక్ష్మ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సెంటిమెంట్ బల పడింది. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ గురువారం 371.95 పాయింట్లు (0.52 శాతం) పుంజుకుని లైఫ్ టైం గరిష్ట స్థాయి 72,410.38 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్లో 445.91 పాయింట్లు (0.61 శాతం) పెరిగి 72,484.34 పాయింట్లతో ఆల్ టైం గరిష్ట స్థాయి నమోదైంది. గత ఐదు సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,904.07 పాయింట్లు (2.70 శాతం) లబ్ధి పొందింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో సానుకూల వాతావరణం నేపథ్యంలో బీఎస్ఈ లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఐదు రోజుల్లో రూ.12,80,559.2 కోట్లు పెరిగి రూ.3,63,00,558.07 కోట్ల లైఫ్ టైం గరిష్టం నమోదు చేసింది.
బీఎస్ఈ సెన్సెక్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, నెస్ట్లే, టాటా మోటార్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంకు భారీగా లబ్ధి పొందాయి. మరోవైపు లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టీ), విప్రో, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. ఏషియన్ మార్కెట్లలో సియోల్, షాంఘై, హంకాంగ్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. టోక్యో స్టాక్ మార్కెట్ నష్టాలతో సరి పెట్టుకున్నది. బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాలు గడించాయి. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 0.73 శాతం తగ్గి 79.07 డాలర్లకు పడిపోయింది.
స్టాక్ మార్కెట్ల డేటా ప్రకారం బుధవారం వరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రూ.2,926.05 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.66 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం లాభ పడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2.45 శాతం, ఇంధనం 2.18 శాతం, మెటల్ 1.60 శాతం, ఎఫ్ఎంసీజీ 1.24 శాతం, రియాల్టీ 0.97 శాతం, పవర్ 0.95 శాతం లాభాలతో ముగిసాయి. మరోవైపు ఇండస్ట్రీయల్, ఐటీ ఇండెక్స్లు నష్టపోయాయి.