ముంబై, జూలై 19: అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్ రికార్డుల ర్యాలీ వరుసగా ఐదో ట్రేడింగ్ రోజున సైతం కొనసాగింది. బుధవారం సరికొత్త రికార్డులు నెలకొన్నాయి. క్రితం రోజు 67,000 పాయింట్లపైన ముగిసే అవకాశాన్ని కోల్పోయిన బీఎస్ఈ సెన్సెక్స్ తాజాగా ఈ ఫీట్ సాధించింది. 302 పాయింట్లు లాభపడి నూతన రికార్డుస్థాయి 67,097 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
ఇదేరీతిలో ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా కీలకమైన 19,800 పాయింట్ల స్థాయిని అధిగమించి 19,833 వద్ద ముగింపు రికార్డును నెలకొల్పింది. ఈ సూచి 84 పాయింట్లు లాభపడింది. అలాగే భారత్ వృద్ధి రేటు 6.4 శాతం, వచ్చే ఏడాది 6.7 శాతం చొప్పున ఉంటుందంటూ ఏడీబీ అంచనాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించాయని విశ్లేషకులు వివరించారు.